Crucial:బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. భారత పర్యటనలో ఆసీస్ జట్టు గట్టిగా పోరాడుతుందేమోనని అభిమానులంతా భావిస్తే… రెండు టెస్టుల్లోనూ కంగారూలు మూడు రోజులకే చేతులెత్తేశారు. దాంతో… మిగతా రెండు టెస్టుల్లోనూ రోహిత్ సేన జోరు కొనసాగుతుందని అంతా భావిస్తున్నారు. ఆ రెండు మ్యాచ్ల ఫలితాలు ఎలా వస్తే.. టెస్ట్ ర్యాంకింగ్స్తో పాటు వరల్డ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తులు ఎలా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
భారత పర్యటనకు వచ్చే ముందు… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు వరుసగా రెండు టెస్టుల్లో ఓటమితో… 66.67 శాతానికి పడిపోయింది. ఇక రెండు మ్యాచ్లు గెలవడంతో భారత్ విజయాల శాతం 64.06 శాతానికి చేరింది. మిగతా రెండు టెస్టులను డ్రా చేసుకోగలిగినా… పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి టీమిండియా డబ్యుటీసీ ఫైనల్కు చేరుతుంది. టెస్ట్ సిరీస్ను 3-0 తేడాతో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుతుంది. ఒకవేళ 3-1 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిచినా ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. అదే మిగతా రెండు టెస్టుల్లోనూ గెలిచి 4-0 తేడాతో సిరీస్ పట్టేస్తే, డబ్ల్యూటీసీలో తొలి ఫైనలిస్ట్గా మారుతుంది… భారత్. ఇక రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా… న్యూజిలాండ్-శ్రీలంక సిరీస్పై ఆధారపడాల్సి ఉంటుంది.
ఇప్పటికే వన్డే, T-20 ఫార్మాట్లో టీమిండియాదే అగ్రస్థానం. టెస్టుల్లోనూ రోహిత్ సేన నెంబర్ వన్ కావాలంటే… మిగతా రెండు టెస్టుల్లో కనీసం ఒకటైనా గెలిచి సిరీస్ను 3-1 తేడాతో గెలవాల్సి ఉంటుంది. అదే టీమిండియా 4-0 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిస్తే టాప్ ర్యాంక్ సొంతమవడంతో పాటు… ఆస్ట్రేలియా ర్యాంకు మరింత పడిపోతుంది. అటు టెస్ట్ ర్యాంకింగ్స్, ఇటు డబ్ల్యుటీసీ ఫైనల్ బెర్త్ కోసం మిగతా రెండు టెస్టు మ్యాచ్ల ఫలితాలు కీలకం కావడంతో… ఏం జరుగుతుందా? అని భారత క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
IT Sector:నష్టాల్లో ఐటీ రంగం..? నిజమేనా..?
IND Vs AUS : జడేజా, అశ్విన్ స్పిన్ మాయాజాలం.. ఢిల్లీ టెస్టులో భారత్ సూపర్ విక్టరీ..