South Africa beat West Indies by 3 Wickets: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్ జట్టుకు షాక్ తగిలింది. తాజాగా, జరిగిన మ్యాచ్లో సౌత్రాఫికా చేతిలో ఓటమి చెందింది. కీలక మ్యాచ్లో చివరి వరకు పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మొదటి ఓవర్లోనే విండీస్కు షాక్ తగిలింది. ఓపెనర్ హోప్.. జాన్సన్ బౌలింగ్లో క్యాచి ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన పూరన్(1) రెండో ఓవర్లో ఔట్ కావడంతో వెస్టిండీస్ 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
86 పరుగుల భాగస్వామ్యం..
ఓపెనర్ కేల్ మయేర్స్(35) పరుగులు రోస్టన్ ఛేజ్(52) హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్ చక్కదిద్దారు. కీలక సమయాల్లో 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షమ్సీ బౌలింగ్లో మయేర్స్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకపోవడంతో వెస్టిండీస్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. సౌతాఫ్రికా భౌలర్లలో షమ్సీ 3 వికెట్లు పడగొట్టగా.. మార్కో ఎన్ సెన్, మార్ క్రమ్, కేశవ్, రబాడ తలో వికెట్ తీశారు.
వెస్టిండీస్ నిర్ధేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించింది. అయితే వర్షం కారణంగా డీఎల్ఎస్ పద్దతిలో 17 ఓవర్లకు టార్గెట్ 124 పరుగులు ఫిక్స్ చేయగా.. సౌతాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ను పూర్తి చేసింది. 16.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఓపెనర్లు డికాక్(12), హెడ్రిక్స్(0), ట్రిస్టన్ స్టబ్స్(29), క్లాసెన్(22), మార్కో ఎన్ సెన్(21), మార్ క్రమ్(18) పరుగులు చేశారు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 3 వికెట్లు తీయగా.. రస్సెల్ 2, జోసెఫ్ 2 వికెట్లు పడగొట్టారు.
సెమీస్కు సౌతాఫ్రికా..
ఆతిత్య జట్టు వెస్టిండీస్పై సౌతాఫ్రికా గెలవడంతో మొత్తం 6 పాయింట్లతో సెమీస్కు దూసుకెళ్లింది. అయితే గ్రూపు 2 నుంచి ఏ జట్లు సెమీస్కు చేరుతాయనే ఉత్కంఠకు తెర పడింది. తొలుత యూఎస్ఏపై ఇంగ్లాండ్ విజయం సాధించి బెర్తును దక్కించుకుంది. తాజాగా, సౌతాఫ్రికా విక్టరీ సాధించి సెమీస్కు చేరింది. రెండు గ్రూపుల నుంచి రెండేసి జట్లు సెమీస్ చేరే అవకాశం ఉండటంతో గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్లో బెర్తు ఖరారు చేసుకున్నాయి. అయితే సెమీస్లో ఎవరెవరు తలపడుతారనే విషయం ఇవాళ తేలనుంది.