IPL : ఐపీఎల్లో ఫైనల్ కు చేరే రెండో జట్టు ఏదో నేడు తేలిపోనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ మరోసారి ఫైనల్ కు చేరాలన్న పట్టుదలతో ఉంది. ముంబై కూడా అదే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో మేటి జట్ల మధ్య రెండో క్వాలిఫయర్లో ఆసక్తికర పోరు జరుగనుంది.
అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఇది గుజరాత్ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబైకు ఎక్కడైనా సత్తా చాటే దమ్ము ఉంది. ఈ సీజన్లో రెండు జట్లూ చేజింగ్లో ఆరేసి మ్యాచ్ల్లో నెగ్గి సత్తా చాటాయి.
లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది గుజరాత్ టైటాన్స్. కానీ తొలి క్వాలిఫయర్లో 4సార్లు ఛాంపియన్ అయిన చెన్నై చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. స్టార్ ప్లేయర్ గిల్, సాహా, హార్ధిక్ పాండ్యా, మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియాతో గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. రషీద్ ఖాన్ కూడా బ్యాట్ తో మెరుపులు మెరిపించడం ఆ జట్టుకు అదనపు బలం. బౌలింగ్ లోనూ షమీ, రషీద్ ఖాన్ కీలకం కానున్నారు.
ముంబై ఇండియన్స్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో 200 పైగా పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే ఛేదించింది. ఎలిమినేటర్లో లక్నోను చిత్తు చేసింది. పటిష్టమైన బ్యాటింగ్, వైవిధ్యమైన బౌలింగ్ విభాగం ఉన్న రోహిత్ సేనను ఢీకొట్టడం అంత సులభం కాదు. రోహిత్, ఇషాన్ కిషన్, గ్రీన్, సూర్యకుమార్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మతో బ్యాటింగ్ విభాగం.. గుజరాత్ కంటే బలంగా ఉంది. బౌలింగ్ లోనూ యువ సంచలనం ఆకాశ్ మధ్వాల్ ఇప్పుడు ముంబైకు అదనపు బలంగా మారాడు. జోర్డాన్, బెహ్రెన్డార్ఫ్, పీయూశ్ చావ్లాలతో బౌలింగ్ గుజరాత్ కు దీటుగానే ఉంది.
ఇక అహ్మదాబాద్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదుకావడంతో పిచ్పై పగుళ్లు రాకుండా కవర్లు కప్పారు. పిచ్ పేస్ కు అనుకూలమని క్యూరేటర్ తెలిపారు. నిలదొక్కుకుంటే బ్యాటర్లు భారీగా పరుగులు సాధించే అవకాశం ఉంటుందని అంచనా. మరి రెండో క్వాలిఫైయర్ లో గెలిచేదెవరు? చెన్నైను ఫైనల్ లో ఢీకొట్టేదెవరు..?
Leave a Comment