Indian cricketers:ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు, అభిమానులు ఇప్పుడు భారత పిచ్ల మీద పడి ఏడుస్తున్నారు. ఈజీగా గెలిచేందుకు భారత జట్టుకు అనుకూలమైన పిచ్లు తయారు చేశారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దాంతో… మీ దేశంలో పిచ్లు మీరు అనుకూలంగా తయారు చేయించుకోరా? అని భారత మాజీ క్రికెటర్లు, అభిమానులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.
నాగ్పూర్ టెస్టులో ఆసీస్ ఓటమి తర్వాత ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు పిచ్ విషయంలో పెద్దగా స్పందించలేదు. ఢిల్లీ టెస్టులో ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 263 రన్స్ చేసినప్పుడూ, టీమిండియాను 262 పరుగులకే ఆలౌట్ చేసినప్పుడు కూడా పిచ్ గురించి మాట్లాడలేదు. ఎప్పుడైతే రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 113 పరుగులకు ఆలౌటైందో… అప్పటి నుంచే పిచ్ మీద విమర్శలు ప్రారంభించారు. భారత స్పిన్నర్లకు అనుకూలంగా పిచ్లు తయారు చేయడం వల్లే ఓడిపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు.
నిజానికి ఏ దేశంలో క్రికెట్ మ్యాచ్లు జరిగినా… పిచ్లు ఆతిథ్య జట్టుకు అనుకూలంగానే ఉంటాయి. భారత్ క్రికెట్ జట్టు గత ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కూడా… కంగారూలకు అనుకూలమైన పిచ్లే తయారు చేశారు. అందుకే ఓ టెస్టులో టీమిండియా కేవలం 36 పరుగులకే ఆలౌటైంది. ఇటీవల సౌతాఫ్రికా జట్టు ఆస్ట్రేలియా పర్యనటకు వెళ్లినప్పుడు కూడా ఆసీస్ బౌలర్లకు అనుకూలమైన పిచ్లే తయారు చేశారు. వాటి మీద టెస్ట్ మ్యాచ్లు గట్టిగా రెండు రోజులు కూడా జరగలేదు. రెండు జట్లు కేవలం 143 ఓవర్లు మాత్రమే ఆడాయి. అనుకూలమైన పిచ్ల మీద సీమర్లు చెలరేగడంతో… సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
తమ గడ్డపై అనుకూలమైన పిచ్లు తయారు చేసినప్పుడు పెగలని గొంతులు… ఇప్పుడు ఇండియా పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్టుల్లో ఓడిపోగానే… శోకాలు పెడుతున్నాయి. దాంతో… పిచ్లపై ఏడవడం మానేసి ముందు పరిస్థితులకు అలవాటు పడాలని భారత మాజీ క్రికెటర్లు కౌంటర్ ఇస్తున్నారు. స్పిన్ ఆడడం అంత తేలిక కాదన్న విషయం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని, దమ్ముంటే స్పిన్ను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఆడడం చేతగాకపోతే ఎలా ఆడాలో నేర్చుకోవాలే తప్ప… అడ్డగోలు వాదన చేయొద్దని హితవు పలుకుతున్నారు.
IND Vs AUS : చివరి రెండు టెస్టులకు అదే జట్టు.. తొలి వన్డేకు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా..