![](https://www.bigtvlive.com/wp-content/uploads/2023/07/rains-1.jpg)
Delhi floods news today(Breaking news of today in India): దేశ రాజధాని న్యూఢిల్లీ జల ప్రళయంలో చిక్కుకుంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో మహానగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు యమునా నది మరింత ఉధృతరూపం దాల్చి ప్రవహిస్తోంది. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నది నీటిమట్టం బుధవారం 207.71 మీటర్లకు చేరింది. 1978లో 207.49 మీటర్ల నీటిమట్టం నమోదు కాగా.. రాత్రి 10 గంటలకు మరింత 208.05 మీటర్లకు పెరిగింది. ఉత్తర ఢిల్లీలోని కీలక రింగ్ రోడ్డుపైకి నీరు చేరగా.. రాత్రికి మరింత పెరిగింది. మఠం, కశ్మీర్ గేట్ సమీపంలో రోడ్డు మునిగిపోయింది. ఐటీవోనూ ముంచెత్తిన నీరు తూర్పు ఢిల్లీ వైపునకు ప్రవహిస్తోంది.
యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో.. సమీప ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రత దృష్ట్యా.. ఢిల్లీ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. మరో వైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు.. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ లేఖ రాశారు. ఢిల్లీలో యమునా నది నీటిమట్టం మరింత పెరగకుండా చర్యలు తీసుకొనే విషయంలో సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి వస్తున్న యమునా నదీ ప్రవాహం ఢిల్లీని కలవరపెడుతోంది.
ఉత్తరాఖండ్ తో పాటు ఎగువ రాష్ట్రాల నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహాలు నగరాన్ని వణికిస్తున్నాయి. హర్యానాలో హత్రీకుండ్ బ్యారేజీ నుంచి నీటి విడుదలను తగ్గిస్తే ఢిల్లీలో వరదలు తగ్గుముఖం పడతాయని అధికారులు సూచిస్తున్నారు. యుమునా నదిలో నీటిమట్టం 207.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. అదే జరిగితే భారీ నష్టం వాటిల్లుతుందని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న జల ప్రవాహమే ఇందుకు కారణమని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.