Agitation of Opposition Members in Parliament: పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని సమాధానం ఇస్తున్న క్రమంలో ప్రతిపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వీరిని వ్యతిరేకిస్తూ అధికార పక్ష ఎంపీలు కూడా ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదంటూ తీవ్ర స్వరంతో ప్రతిపక్ష సభ్యులను హెచ్చరించారు.
అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలంతా మా వైపే ఉన్నారు. పదేళ్ల మా పాలనను చూసి ప్రజలు మరోసారి తీర్పు ఇచ్చారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదలను దారిద్ర్యరేఖ నుంచి బయటకు తెచ్చాం. మేం ప్రవేశపెట్టిన పథకాలు అట్టడుగు వర్గాలకు చేరాలన్నదే మా విధానం. మా ప్రభుత్వ పథకాలు మారుమూల సామాన్యులకూ చేరుతున్నాయి.
ఈ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పు ఇచ్చారు. 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. వికసిత్ భారత్ దిశగా మా సంకల్పంలో ఎలాంటి మార్పు ఉండదు. దేశం అభివృద్ధి చెందితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. దేశాభివృద్ధితోనే భావితరాలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వగలం. మా పాలనలో పట్టణాలు, గ్రామల రూపురేఖలు మారాయి. వికసిత్ భారత్ సాధించేవరకు పగలూరాత్రీ కృషి చేస్తాం. వికసిత్ భారత్ సాధిస్తామని దేశ ప్రజలకు భరోసా ఇస్తున్నా’ అంటూ ప్రధాని పేర్కొన్నారు.
‘2014లో దేశ ప్రజలంతా నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. 2014కు ముందు ఏ పేపర్ చూసినా కుంభకోణాలే కనిపించేవి. గత ప్రభుత్వాల పాలనలో రూపాయిలో యాభై పైసలు అవినీతే జరిగేది. 2014కు ముందు దోషులు చట్టం నుంచి తప్పించుకునేవారు. 2014 తరువాత దోషుల ఇళ్ల వద్ద బుల్లెట్ల వర్షం కురిసింది. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాం. 370 ఆర్టికల్ తొలగించాక జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రతలు మెరుగయ్యాయి.
మా ప్రభుత్వం వచ్చాక ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గతంలో గ్యాస్ కనెక్షన్ కోసం ఎంపీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. 2014కు ముందు పేదలకు రేషన్ బియ్యం దొరకడం కష్టంగా ఉండేది. మా హయాంలో దేశంలో అనేక మార్పులు వచ్చాయి. ఎంతో నమ్మకం, ధైర్యంతో ప్రజలంతా మాకు అండగా నిలిచారు’ అని మోదీ అన్నారు.
Also Read: లోక్సభలో ఎంపీ అఖిలేష్ ఎదురుదాడి, బీజేపీ ఉక్కిరి బిక్కిరి
అనంతరం రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మాట్లాడారు. రాహుల్ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. ‘రాహుల్ గాంధీ పిల్ల చేష్టలు ఈ సభలో చాలాసార్లు బయటపడ్డాయి. రాహుల్ సభలో కన్ను కొడుతారు.. ఆలింగనం చేసుకుంటారు. ఈ చర్యలన్నీ రాహుల్ అపరిపక్వతను తెలియజేస్తున్నాయి. సానుభూతి పొందేందుకు పిల్లాడి డ్రామాలు అందరూ చూశారు. సభ గౌరవమర్యాదలను తగ్గించాలని చూడడం మంచిదికాదు’ అంటూ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.