Vande Bharat Express : హైదరాబాద్ లో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రాబోతోంది. బెంగళూరుకు సర్వీస్ నడపాలని రైల్వేశాఖ యోచిస్తోంది. ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సికింద్రాబాద్-తిరుపతి మధ్య కొత్త వందే భారత్ రైలు ప్రారంభించారు. ఈ సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు నడిపే అంశాన్ని స్థానిక బీజేపీ నేతలతో ప్రస్తావించారని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి ఈ సర్వీసు నడుస్తుందో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతికి సర్వీసులు నడుస్తున్నాయి.
ఇప్పటికే కాచిగూడ నుంచి బెంగళూరుకు పలు రైళ్లు నడుస్తున్నాయి. 570 కి.మీల ప్రయాణానికి కనీసం 11 గంటల సమయం పడుతోంది. అదే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం 4గంటలు తగ్గుతుంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు నడిపే అంశంపై జనవరిలోనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచనలు చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు వందే భారత్ రైలు గురించి ప్రచారంలో ప్రస్తావిస్తున్నారని సమాచారం. దేశంలో ముఖ్యమైన టెక్ హబ్లుగా ఉన్న హైదరాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ సర్వీసు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ ప్రయాణికుల నుంచి వస్తోంది. సికింద్రాబాద్ నుంచి పుణెకు మరో వందే భారత్ రైలును నడుపుతారనే వార్తలు వినపడుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 13 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.
ఈ ఏడాది జనవరి 14న సికింద్రాబాద్- విశాఖ వందేభారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. తాజాగా ఏప్రిల్ 8న హైదరాబాద్ వచ్చి తిరుపతి సర్వీసుకు పచ్చజెండా ఊపారు. బెంగళూరు సర్వీస్ ప్రారంభమైతే హైదరాబాద్ నుంచి మూడో వందే భారత్ రైలు అందుబాటులో ఉంటుంది.