Dharmendra Pradhan: నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు నిర్ధారణ అయితే అందుకు బాధ్యులైన ఎన్టీఏ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ పరీక్షల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, పరీక్షల నిర్వహణలో అధికారులు ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సుప్రీం కోర్టు సూచనలకు అనుగుణంగా 1563 మంది అభ్యర్థులకు తిరిగి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రెండు చోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ఎన్టీఏ ఉన్నతాధికారులు ఎవరైనా దోషులుగా తేలితే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని చెప్పారు. ఎన్టీఏ ప్రక్షాళన అవసరమని.. ఈ దిశగానే చర్యలు చేపడతామని, తప్పులు చేసిన వారు తప్పించుకోలేని విధంగా కార్యచరణ చేపడతామని వెల్లడించారు.
Also Read: ఢిల్లీలో నీటి సంక్షోభం.. వాటర్ పైపులైన్లకు పోలీసు భద్రత ?
నీట్ యూజీ 2024లో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థుల ముందు రెండు మార్గాలు ఉన్నాయని అన్నారు. ఈ నెల 23వ తేదీన మళ్లీ పరీక్ష రాసి జూన్ 30 నాటికి నూతన స్కోర్ పొందడం లేదా గ్రేస్ మార్కులు లేకుండా గతంలో సాధించిన స్కోర్ ఆమోదించాలని తెలిపారు. నీట్ పరీక్షల పశ్నాపత్రం లీకేజీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.