Several feared Dead in Stampede: ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం నెలకొన్నది. హత్రాస్లో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రజలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు అధికంగా ఉన్నట్లు సమాచారం.
రతీభాన్పూర్లో మంగళవారం శివుడికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే స్థానికులు ఒక్కసారిగా గుంపులు గుంపులుగా వెళ్లారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకున్నది. ఈ ఘటనలో సుమారు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వంద మందికిపైగా గాయపడ్డారని సమాచారం.
విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read: ‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం.. పరీక్షకు 2 గంటలకు ముందే ఎగ్జామ్ పేపర్ రెడీ
యూపీ సీఎం ఆదిత్యనాథ్ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. రాష్ట్రతి ద్రౌపది ముర్ము, లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిథ్యనాథ్ సోషల్ మీడియా(ఎక్స్)లో తెలిపారు. రాష్ట్ర మంత్రులు లక్ష్మీ నారాయణ్ చౌదరి, సందీప్ సింగ్ సంఘటనా స్థలికి బయలుదేరివెళ్లారు.
ఈ దుర్ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ఇది ఓ ప్రైవేట్ కార్యక్రమం. దీనికి సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. అధికారులే భద్రతా ఏర్పాటు చేశారు కానీ, మిగతా ఏర్పాట్లను వారే చేసుకున్నారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాపై దృష్టిసారించాం’ అంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: భారీ ఎన్కౌంటర్.. 11 మంది మావోయిస్టులు మృతి
చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేశ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పలు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తీసుకువచ్చారని తెలిపారు. గాయపడినవారికి చికిత్స అందుతుందని చెప్పారు. దర్యాప్తు తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.