Lok sabha Election Results 2024(Latest political news in India): ప్రధాని మోదీ తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విపక్షాలపై స్వల్ప ఆధిక్యంలో ఎన్డీఏ కొనసాగుతుండటంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్ దాటకపోవడంతో తాను సంతోషంగా ఉన్నానని మమతా తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని మోదీ కోల్పోయారని విమర్శించారు. ఎన్నికల్లో 400కుపైగా సీట్లు గెలుస్తామని అనేక సందర్భాల్లో మోదీ చెప్పారని గుర్తు చేశారు. ఇండియా కూటమిపై ఎన్డీఏ కూటమి స్వల్ప ఆధిక్యతను కనబరిచింది..అందుకే మోదీ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏకు విపక్ష కూటమి గట్టి పోటీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే బెంగాల్లో బీజేపీపై టీఎంసీ ఆధిక్యం కనబరిచింది. 42 లోక్సభ స్థానాలకు గానూ టీఎంసీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ కేవలం 10 స్థానాల్లో ముందంజలో ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ కూడా ఒకటి.
Also Read: బీజేపీ అహంకారంతో రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసింది: రాహుల్ గాంధీ
గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 18 స్థానాల్లో గెలుపొందగా.. ఈ సారి 10 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేలా ఉంది. అయితే ఫలితాలు వెలువడుతున్న సమయంలో రాష్ట్రంలో తాము ఆశించిన రీతిలోనే ఫలితాలు వచ్చాయని మమతా పేర్కొన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వ విధానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తాజా ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.