PM Kisan 17th Installment Deposits Today: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు జమ చేయనుంది. ఈ మేరకు పీఎం కిసాన్ 17వ విడత నిధులను వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి..
పీఎం కిసాన్ పథకం ద్వారా మొత్తం 9.3కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్లు జమ కానున్నాయి. ఈ మేరకు పీఎం మోదీ నగదును విడుదల చేయనున్నారు. దీంతో పాటు పారా ఎక్స్ టెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు శిక్షణ పొందిన 30వేల మందికి పైగా స్వయం సహాయ బృందాల మహిళలకు సర్టిఫికెట్లను మోదీ అందించనున్నారు.
దేశ వ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, లక్షకుపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాల్తో పాటు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంల భాగస్వాములు కానున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. మొదట 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏడాదికి రూ.6వేలు అందించనుంది.వీటిని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఏఫ్రిల్, జులైలో మొదటి విడత, ఆగస్టు, నవంబర్ లో రెండో విడత, డిసెంబర్, మార్చి లో మూడో విడత కింద రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది.
పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు 16 విడతలు రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన కేంద్రం.. నేడు 17వ విడద నిధులు విడుదల చేయనుంది. లబ్ధిదారులు పీఎం కిసాన్ బెనిఫీషియరి స్టేటస్, ఇన్ స్టాల్ మెంట్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు https://pmkisan.gov.in/ పోర్టల్ ఒపెన్ చేసి తెలుసుకునేందుకు అవకాశం ఉంది.