Parliament Monsoon Session: కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులు ఇప్పుడిప్పుడే శాఖల బాధ్యతలు చేపడుతున్నారు. కీలకమైనవి తప్పితే మిగతా శాఖలకు కొత్తవారు బాధ్యతలు తీసుకుంటున్నారు. మరో పదిరోజుల్లో పార్లమెంటు తొలివిడత సమావేశాలు జరగనున్నాయి. ఆ సమయం సభ్యుల ప్రమాణ స్వీకారానికి సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ తక్కువ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం కష్టమని అంటోంది.
జులై థర్డ్ వీక్ నుంచి ఆగష్టు ఫస్ట్ వీక్ వరకు సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈలోగా బడ్జెట్పై అన్నివర్గాల నుంచి సమాచారం తీసుకోవచ్చని భావిస్తోంది. అంతే కాదు చాలా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆయా ప్రభుత్వాల నుంచి సూచనలు-సలహాలు తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఆ క్రమంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనుంది. సూచనలు తీసుకుని బడ్జెట్లో పొందుపరిస్తే బాగుంటుందని అంతర్గత సమాచారం. ఈ సెషన్లో తొలిరోజు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని అనుకుంటోంది.
18వ లోక్సభ సమావేశాలు ఈనెల 24 నుంచి జులై మూడు వరకు జరగనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అయితే తొలివిడత సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నికకు సమయం సరిపోతుందని అంటోంది. మహా అంటే నాలుగైదు రోజులు మాత్రమే ఉంటాయని, ఈ సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టి, చర్చించడం అసాధ్యమంటోంది.
ALSO READ: కేరళ చేరుకున్న కువైట్ ప్రమాద మృతదేహాలు.. ఎయిర్ పోర్టులో నివాళులు
వర్షాకాల సమావేశాల్లో బడ్జెట్ అయితే బాగుంటుందని అంటోంది. దీనికి సంబంధించి రేపో మాపో నిర్ణయం రావచ్చని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే ప్రత్యేక సమావేశాల చివరిరోజు అంటూ జులై 3న ఆర్థిక సర్వేను పార్లమెంటులో పెట్టాలని ఆలోచన చేస్తోంది మోదీ సర్కార్.