Opposition walks out of Lok Sabha(Telugu breaking news): నీట్ ప్రశ్నపత్నం లీక్ అంశంపై లోక్ సభ దద్దరిల్లుతోంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే గందరగోళం నెలకొంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఈ మేరకు నీట్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంపై చర్చించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ గాంధీ కోరారు. నీట్ అంశంపై చర్చకు స్పీకర్ నిరాకరణతో లోక్సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.
ప్రస్తుత సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లేవని, వాయిదా తీర్మానాలను తీసుకోవడం కుదరదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చిద్దామని స్పీకర్ అన్నారు. అయితే నీట్ విద్యార్థులకు పార్లమెంట్ నుంచి భరోసా కల్పించాలని రాహుల్ గాంధీ అన్నారు.
ధన్యవాదాల తీర్మానం తర్వాత నీట్ వ్యవహారంపై చర్చించాలని రాహుల్ కోరారు. అయితే నోటిసు ఇస్తే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పీకర్ వెల్లడంచారు. ఈ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రతిపక్షాలు వినకుండా నీట్ అంశంపై చర్చించాలని పట్టుబట్టాయి. చివరికి స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.