Bhartruhari Mahtab appointed protem Speaker: ఎట్టకేలకు ప్రొటెం స్పీకర్ ఎంపిక పూర్తి చేసింది బీజేపీ. ఒడిషాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించ నున్నారు. రాష్ట్రపతి ముర్ము ఆయన్ని నియమించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. 18వ లోక్సభ సమావేశాలు జూన్ 24 నుంచి మొదలు కానున్నాయి. 24, 25న సభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. 26న లోక్సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు. స్పీకర్ ఎంపిక ఏకగ్రీవమా? లేక ఎన్నికల పెడతారా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగు తోంది.
ప్రొటెం స్పీకర్ ఎంపికపై కేంద్రం పార్లమెంటరీ సంప్రదాయాన్ని పాటించలేదని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేష్ను కాదని, ఏడుపార్లు ఎంపీగా ఎన్నికైన మహతాబ్ను ఎంపిక చేయడాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోందని దుయ్యబట్టింది.
ALSO READ: విద్యార్థుల విషయంలో రాజకీయాలు చేయొద్దు: ధర్మేంద్ర ప్రధాన్
ప్రొటెం స్పీకర్ ప్యానెల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలున్నారు. వారిలో కాంగ్రెస్ నుంచి సురేష్, డీఎంకె నుంచి టీఆర్ బాలు, టీఎంసీ నుంచి సుదీప్ బంధోపాద్యాయ, బీజేపీకి చెందిన రాధామోహన్సింగ్, ఫగన్సింగ్ కులస్తేలు ఉండనున్నారు. స్పీకర్ ఎన్నిక పూర్తి అయ్యేవరకు లోక్సభ ప్రిసైడింగ్ అధికారిగా ఆయన కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
ఎంపీ భర్తృహరి మహతాబ్ డీటేల్స్లోకి వెళ్తే.. ఎంపీ భర్తృహరి మహతాబ్ బీజేడీలో సీనియర్ నేత. 1998, 1999, 2004, 2009. 2014, 2019, 2024 (బీజేపీ) ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల ముందు బిజూ జనతాదళ్కు గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. కటక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.