NEET-PG 2024 Postponed: దేశ వ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. నీట్ యూజీ మీద లీకేజీ ఆరోపణలు రావడంతో శనివారం రాత్రి హడావుడిగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. విద్యార్థుల ప్రయోజనాల కోసమే ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నామని, వీలైనంత త్వరగా కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
ఎన్టీఏ యేటా నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రక్రియలు పటిష్టతను క్షుణ్ణంగా అంచనా వేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పరీక్ష జరగనున్న తేదీని వీలైనంత త్వరగా ప్రకటిస్తామని, విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే సీఎస్ఐఆర్ యూజీసీనెట్ పరీక్షను సైతం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
దేశ వ్యాప్తంగా విద్యార్థులు పరీక్ష రాసేందుకు సుదూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. చివరి నిమిషంలో నీటీ యూజీ వాయిదా వేయడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ తరిగి ఇంటిబాట పట్టారు.
నీట్, నెట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, నెట్ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుభోద్ సింగ్పై వేటు వేసింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్, ఎండీ ప్రదీప్ సింగ్ ఖరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది.
నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించింది. పేపర్ లీకైందని, నీట్ ను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఆరోపణలపై సమగ్ర విచారణ కోసం దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.