Cyclone alert for Bangladesh and Myanmar:- బంగాళాఖాతంలో ఏర్పడిన మోచా తుపాను బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలను వణికిస్తోంది. ఆ దేశాల తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. గంటకు 180- 210 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.
మోచా.. ఐదో కేటగిరి తుపానుగా రూపు దాల్చించింది. దీంతో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలు అప్రమత్తమయ్యాయి. దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. తీరప్రాంతాల సమీపంలో ఉన్న విమానాశ్రయాలను మూసివేశాయి. బంగ్లాదేశ్లో 1,500 తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల శిబిరం కాక్స్ బజార్. ఇక్కడ రోహింగ్యాలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతంపైనే తుపాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్, మయన్మార్ లోని క్యయుక్ప్యూ మధ్య తుపాను తీరాన్ని దాటింది.
రెండు దశాబ్దాల్లో బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న భారీ తుపాన్ ఇదేనని వాతావరణశాఖ హెచ్చరించింది. 2007లో వచ్చిన తుపాన్ ధాటికి బంగ్లాదేశ్ లో 3 వేల మందికిపైగా మృతి చెందారు. ఆ సమయంలో ఆస్తినష్టం తీవ్రంగా వాటిల్లింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ లోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. పుర్బా మేదినీపూర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
Follow this link for more updates:- Bigtv