Mahua Moitra: లోక్సభ ఎంపీ మహువా మొయిత్రాపై వేటు పడింది. ఆమె సభ్యత్వం రద్దుపై సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అనర్హత వేటు వేస్తూ లోక్సభ నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ప్రశ్నలకు ముడుపులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసింది కేంద్రం. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రధాని మోడీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన నివేదికను లోక్ సభలో సమర్పించింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమె పదవిపై వేటు వేసింది. అయితే ఏ ఆధారం లేకుండా తనపై చర్యలు తీసుకున్నారంటూ మహువా మొయిత్రా ఆరోపించారు. తాను ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు కొంత సమయం ఇవ్వాలని, నివేదికపై ఓటింగ్ కు ముందు సభలో చర్చ జరపాలని టీఎంసీ సహా పలువురు విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతినిచ్చారు. అధికార – విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ చర్చలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని మహువా కోరగా.. అందుకు స్పీకర్ అనుమతి నిరాకరించారు. మూజువాణీ ఓటు ప్రక్రియ నిర్వహించి మహువాను బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తదుపరి సభను డిసెంబర్ 11కు వాయిదా వేశారు.
.
.