Bomb threat to Air India Flight: కొచ్చిన్ నుంచి లండన్ వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఈ సమాచారాన్ని ముంబై నుంచి కొచ్చి ఎయిర్పోర్టు అధికారులకు చేరవేశారు.
ఎయిర్పోర్టు సెక్యూరిటీ అధికారులు విమానంలో తనిఖీలు చేపట్టారు. ఇన్ లైన్ స్క్రీనింగ్ సిస్టమ్ ద్వారా లగేజీని చెక్ చేశారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు కనిపించలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఎయిరిండియాకు చెందిన ఏఐ 149 నెంబరు గల విమానం కొచ్చి ఎయిర్పోర్టు నుంచి లండన్ వెళ్లేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో విమానంలో బాంబు పెట్టినట్టు కొందరు ఆగంతకులు ముంబైలోని ఎయిర్ ఇండియా కాల్ సెంటర్కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. తనిఖీలు తర్వాత ఏమీ లేవని తేలడంతో లండన్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చినట్టు కొచ్చిన్ ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.
ALSO READ: తొలి వర్షానికి రామమందిరం పైకప్పు లీక్, విపక్షాలకు చిక్కిన ప్రధాని మోదీ
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మలప్పురం జిల్లాకు చెందిన సుహైబ్గా తేల్చారు. కొచ్చిన్ ఎయిర్పోర్టులో చెకిన్ సమయంలో సుహైబ్, అతడి భార్య, కూతుర్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. ఈ మధ్యకాలంలో స్కూల్స్, ఎయిర్పోర్టులకు విపరీతంగా బాంబు బెదిరింపుల వస్తున్నాయి. దీంతో ఎయిర్పోర్టు తనిఖీలు ముమ్మరం చేసిన విషయం తెల్సిందే.