Karnataka news today(Latest political news in India): కర్ణాటక సీఎం ఎంపికపై ఢిల్లీలో ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లి రాహుల్ గాంధీ కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. గంటన్నరసేపు ఈ సమావేశం కొనసాగింది. కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సూర్జేవాలా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. పరిశీలకుల నివేదికపై ఖర్గే-రాహుల్ చర్చించారని సమాచారం.
సిద్ధరామయ్య, డీకే విడివిడిగా ఖర్గేతో భేటీ అయ్యారు. అంతకుముందు కర్ణాటక నుంచి వచ్చిన నేతలు, ఆ రాష్ట్రానికి పార్టీ పరిశీలకులుగా వెళ్లి వచ్చిన ముగ్గురు నాయకులతోనూ ఖర్గే చర్చించారు. ఢిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్ సీఎం పదవి కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖర్గేతో శివకుమార్ అరగంటపాటు చర్చించారు. డీకే సోదరుడు, ఎంపీ సురేశ్ కూడా ఖర్గేను కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడితో సిద్ధరామయ్య భేటీ అయ్యారు.
బుధవారం సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో చర్చించిన తర్వాత కర్ణాటక సీఎం ఎవరనేది మల్లికార్జున్ ఖర్గే ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ భేటీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా పాల్గొంటారని సమాచారం. అధిష్ఠాన నిర్ణయాన్ని ఖర్గే బెంగళూరులోనే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
సీఎం పదవి రాకపోయినా తాను పార్టీకి వెన్నుపోటు పొడవనని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయనని శివకుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ తనకు తల్లితో సమానమన్నారు. కాంగ్రెస్కి రాజీనామా చేసే ప్రశ్నే లేదని స్పష్టంచేశారు. తనకు మద్దతుగా ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేలను విభజించనని తేల్చిచెప్పారు. డీకే చేసిన ఈ వ్యాఖ్యలతో సిద్ధరామయ్యకే సీఎం పదవి దక్కుతుందని స్పష్టమైంది. కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యే వైపే మొగ్గుచూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.