Siddaramaiah News Today(Latest breaking news in telugu) : మూడురోజుల ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక కొత్త సీఎంగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. సుధీర్ఘ సంప్రదింపుల తర్వాత సిద్ధువైపే మొగ్గు చూపింది. అనుభవం ఉన్న నేతనే సీఎంను చేయాలని నిర్ణయించింది. సాయంత్రంలోపు అధికారిక ప్రకటన వెలువడనుంది. కేబినెట్ కూర్పుపై కూడా కసరత్తు జరుగుతోంది.
గురువారం కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత సీఎంగా సిద్ధరామయ్య ఒక్కరే ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 3.30- 4 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు బెంగళూరులో సిద్ధరామయ్య ఇంటి వద్ద భద్రతను పెంచారు.
డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్యకు రెండేళ్లు, డీకేకు 3 ఏళ్లు సీఎం పదవి ఇస్తామని హైకమాండ్ ప్రతిపాదించిందని సమాచారం. కీలక శాఖలను అప్పగిస్తామని డీకేకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీప్యూటీ సీఎం పదవి తీసుకోవడానికి శివకుమార్ నిరాకరించారని సమాచారం. కేవలం ఎమ్మెల్యేగా ఉండేందుకే మొగ్గు చూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
కర్ణాటకలో సిద్ధరామయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సిద్ధూ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు డీకే ఫ్యాన్స్ నిరాసలో ఉన్నారు.