Karnataka Results(Latest breaking news in telugu): కర్ణాటక ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. మరికొద్ది గంటల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈసారి కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీకి 86 నుంచి 119 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. అయితే, మేజిక్ ఫిగర్పై ఉత్కంఠ నడుస్తోంది. హంగ్ ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్లో తీవ్ర ఉత్కంఠ. పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి. సౌత్ గేట్ స్టేట్ ఫలితాన్ని యావత్ దేశమూ గమనిస్తోంది.
2018 ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకూడదని ప్రతి పార్టీ కోరుకుంటోంది. ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్కు పార్టీలకు కునుకు కరువైంది. ఇప్పటి నుంచే వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకొని పెట్టుకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఇప్పటికే బీజేపీ హైకమాండ్ పావులు కదుపుతోందనే అనుమానాలు హస్తం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరుపై పూర్తి పట్టున్న బీజేపీకి అక్కడ పోలింగ్ శాతం పడిపోవడం టెన్షన్ పెట్టిస్తోంది.
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేక పవనాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేల్లో స్పష్టమైంది. అధికారం మాదే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నా.. ఆపరేషన్ కమలం ఎలా ఉండబోతోందోనని హడలిపోతున్నారు. దీంతో ఫలితాల తర్వాత పరిస్థితులను చక్కబెట్టేందుకు ఆ పార్టీ అగ్రనేతలు బెంగళూరు చేరుకున్నారు. మాజీ సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో రణదీప్ సింగ్ సూర్జేవాలా సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
మరోవైపు, మెజారిటీ సీట్లు రాకపోతే మళ్లీ కాంగ్రెస్ -JDS జోడీ కట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. హంగ్ తలెత్తితే ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై జనతాదళ్ లెక్కలు వేసుకుంటోంది. ఆ పార్టీ చీఫ్ కుమారస్వామి సింగపూర్లో ఉండగా.. అక్కడి నుంచే కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయంకల్లా కుమారస్వామి బెంగళూరు చేరుకోనున్నారు. ఛాన్స్ చిక్కితే.. మళ్లీ చక్రం తిప్పేది తానేనని తెగ ఖుషీగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో మాదిరిగానే కింగ్ మేకర్ గా లేదా కింగ్ గా మారాలని జేడీఎస్ ప్రయత్నిస్తోంది.
అన్నిపార్టీలు పోటీ చేసిన మెజార్టీ అభ్యర్థులు, గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న వారిని క్యాంపులకు తరలిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే అభ్యర్థులంతా పార్టీ నాయకత్వానికి అందుబాటులో ఉండాలని సందేశాలు వెళ్లాయి.
ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి.. తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు రాకపోయినా.. గెలిచేదెవరో తేలిపోనుంది. మొత్తం 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 113.