Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర గవర్నర్ దీదీపై పరువు నష్టం దావా కేసు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఈ మేరకు గవర్నర్ సీవి ఆనంద్ బోస్ సీఎం మమతా బెనర్జీతో పాటు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలపై కలకత్తా హైకోర్టులో కేసు వేయడం హాట్ టాపిక్గా మారింది.
గవర్నర్ పై దీదీ చేసిన వ్యాఖ్యల కారణంగానే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్ భవన్ లో జరుగుతున్న అక్రమ కార్యక్రమాల వల్ల మహిళలు ఆ ప్రాంతానికి వెళ్లడానికే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దీంతో దీదీ వ్యాఖ్యలని తప్పుబడుతూ ఆనంద్ బోస్ కోర్టులో ఆమెపై పరువు నష్టం దావా వేశారు. కాగా దీదీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ టీఎంసీ నేతలు కూడా అవే వ్యాఖ్యలను చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా సెక్రటేరియట్లో జరిగిన ఓ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజ్ భవన్ వెళ్లేందుకు భయపడుతున్నాం అంటూ మహిళలను నాకు చెప్పారు’ అని దీదీ చెప్పుకొచ్చారు. దీంతో గవర్నర్ ముఖ్యమంత్రిపై పరువు నష్టం దావా కేసు వేస్తూ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు టీఎంసీ రాజ్యసభ సభ్యుడైన ఎంపీ డోలా సెన్ ని ప్రశ్నించగా.. పార్టీ పెద్దలతో చర్చించకుండా ఇలాంటి విషయాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని అన్నారు. ఇక గవర్నర్ నిర్ణయానికి బీజేపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు.