Highcourt stay on CM Kejriwal release: దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వలేదన్న సామెత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు అతికినట్టు సరిపోతుంది. కాసేపట్లో తీహార్ జైలు నుంచి విడుదల కానున్న ఆయనకు ఊహించని షాక్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. కేజ్రీవాల్ విడుదలపై కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గురువారం రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతేకాదు లక్ష పూచీకత్తుగా సమర్పించాలని న్యాయస్థానం పేర్కొంది. కిందికోర్టు ఇచ్చిన తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేయడానికి 48 గంటలపాటు సమయం కావాలని ఈడీ వాదనను ట్రయల్ కోర్టు నిరాకరించింది.
ఈ క్రమంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కేజ్రీవాల్ బెయిల్పై స్టే ఇవ్వాలని ఈడీ పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ బెయిల్ వ్యతిరేకించేందుకు న్యాయస్థానం మాకు సరైన అవకాశం ఇవ్వలేదని అందులో ప్రస్తావించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించి అత్యవసర చర్యలు చేపట్టాలని కోరింది.
ALSO READ: ఢిల్లీ లిక్కర్ స్కాం.. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు..
ఈడీ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు, దీనిపై శుక్రవారం విచారణ జరుపుతామని పేర్కొంది. అప్పటివరకు ట్రయిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం దీనిపై కాసేపట్లో న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ లేదు. ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత బెయిల్ వస్తుందా? లేదా అన్నది తెలియాల్సివుంది.