Congress Claimed that Rahul Gandhi’s Mic was turned off: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరపాలంటూ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలను వాయిదా వేశారు. అంతకంటే ముందు లోక్ సక్షలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశం లేవనెత్తగానే ఆయన మైక్ ను ఆపేశారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు సోషలో మీడియా(ఎక్స్) వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. మైక్రోఫోన్ లో మాట్లాడేందుకు వీలు కల్పించాలంటూ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ గాంధీ కోరుతున్న దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తోంది.
‘నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని మోదీ ఏం మాట్లాడలేదు. సభలో యువత తరఫున రాహుల్ గాంధీ తన గొంతును వినిపిస్తున్నారు. ఇలాంటి అతి ముఖ్యమైన సమయంలో కూడా మైక్ ఆఫ్ చేయడం వంటి చౌకబారు పనులకు పాల్పడి, యువత గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నది’ అంటూ కాంగ్రెస్ తన అందులో పేర్కొన్నది. అయితే, తాను అలా చేయబోనని, అలాంటి నియంత్రణ ఏదీ కూడా తన వద్ద లేదంటూ స్పీకర్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగాల్సిన సమయంలో ఇతర అంశాలు రికార్డు కావంటూ ఆయన వెల్లడించారు.
అయితే.. నీట్ పేపర్ లీక్ పై చర్చ జరపాలంటూ విపక్ష నేతలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చింన తరువాత ఈ అంశంపై చర్చిద్దామని స్పీకర్ చెప్పినా.. విపక్ష నేతలు ఆందోళన ఆపలేదు. విపక్షాల ఆందోళనతో ససేమిరా అన్న స్పీకర్.. నీట్ పేపర్ అంశంపై చర్చించేందుకు నో చెప్పారు. దీంతో విపక్ష పార్టీల నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లింది. సభను అదుపు చేసేందుకు ముందుగా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేయగా, మరోసారి కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో సభను సోమవారానికి అంటే జులై 1కి వాయిదా వేశారు స్పీకర్.
Also Read: డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి? ఎన్డీయే- ఇండియా కూటమికా? లెక్కలు..
అయితే, నీట్ వివాదంపై చర్చ జరగాలని, ఇందుకు సంబంధించి కేంద్రం ప్రకటన చేయాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ‘నీట్ పేపర్ లీక్ సమస్య దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశం. దీనిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని మోదీ చేపట్టాలి. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయన్న సందేశాన్ని పార్లమెంట్ నుంచి ఇవ్వాలి’ అంటూ రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.