CM Stalin says Kodanad case: తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా సాగాయి. అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చివరకు నిరవధికంగా సమావేశాలను వాయిదా వేశారు స్పీకర్. రీసెంట్గా తమిళనాడులోని కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనపై విపక్ష అన్నాడీఎంకె… స్టాలిన్ సర్కార్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొడనాడు కేసు తెరపైకి తెచ్చారు సీఎం స్టాలిన్.
కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనపై తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా సాగాయి. దీనిపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని విపక్ష అన్నాడీఎంకె డిమాండ్ చేసింది. సభను అడ్డుకునే ప్రయత్నం చేసింది. పరిస్థితి గమనించిన సీఎం స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. దివంగత మాజీ సీఎం జయలలితకు సొంతమైన నీలగిరి జిల్లాలో కొడనాడు ఎస్టేట్ ఘటనను తెరపైకి తెచ్చారు. కొడనాడు ఎస్టేట్లో జరిగిన హత్య, దోపిడీకి సంబంధించిన కేసును ఇంటర్ పోల్ సాయంతో విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని, ఇప్పటివరకు 268 మంది సాక్షులను విచారించినట్టు తెలిపారు ముఖ్యమంత్రి. నిందితులు ఉపయోగించిన ఎనిమిది సెల్ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులను కోయంబత్తూరు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో కొంత మంది నిందితులకు విదేశాల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. అందువల్లే ఈ కేసును ఇంటర్ పోల్ సాయంతో విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. దీంతో కొడనాడు ఎస్టేట్ ఘటన పై తమిళనాట ప్రజలు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
ALSO READ: ప్రధాని మోదీపై సోనియా కామెంట్స్.. ఓడినా, ఏమాత్రం మారలేదు..
సీఎం స్టాలిన్ ప్రకటనపై అన్నాడీఎంకె సభ్యులు మండిపడ్డారు. కల్తీసారా ఘటన నుంచి తప్పించు కునేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా వర్ణించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సమావేశాల చివరిరోజు కావడంతో పరిస్థితి గమనించిన పీఎంకె సభ్యులూ సభ నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు జూన్ 20న మొదలయ్యాయి.