Bridge Collapses in Bihar: బీహార్లో వంతెనలు వరుసగా కుప్పకూలుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం తూర్పు చంపారన్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కుప్పకూలింది. మోతీహరిలోని ఘోరసహన్ బ్లాక్లో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అమ్వా గ్రామాన్ని బ్లాక్లోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడానికి రాష్ట్ర గ్రామీణ పనుల విభాగం (RWD) కాలువపై 16 మీటర్ల పొడవైన వంతెనను నిర్మిస్తోంది. కాగా ఈ వంతెనను 1.5 కోట్లతో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
“ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఇది తీవ్రమైన విషయం. శాఖాపరమైన విచారణకు ఆదేశించాం. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము” అని RWD అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ సింగ్ తెలిపారు.
Also Read: Arvind Kejriwal bail petition: లిక్కర్ కేసు.. సీఎం కేజ్రీవాల్కు నిరాశ, జూన్ 26న సుప్రీంకోర్టులో
జిల్లా పరిపాలన సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక పైఅధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకుంటున్నామని జిల్లా మేజిస్ట్రేట్ సౌరభ్ జోర్వాల్ తెలిపారు.
వంతెనలోని పిల్లర్ల నిర్మాణంపై స్థానికులలోని ఒక వర్గం మొదట అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నివేదికలు ఉన్నాయని ఆయన తెలిపారు. పోలీసులు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
అటు శనివారం సివాన్ జిల్లాలో ఓ చిన్న వంతెన కూలిపోయింది. ఇది దారౌండా, మహారాజ్గంజ్ బ్లాక్ల గ్రామాలను కలుపుతూ కాలువపై నిర్మించారు.
Also Read: ప్రారంభానికి ముందే కుప్ప కూలిన బ్రిడ్జ్.. కోట్ల రూపాయలు వృథా..
అంతకు ముందు మంగళవారం అరారియా జిల్లాలో 180 మీటర్ల పొడవున కొత్తగా నిర్మించిన వంతెన కూలిపోయింది.
ఇలా వరుసగా కుప్పకూలుతున్న వంతెనలు ప్రజల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఘటన వలన ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ పనుల నాణ్యతలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.