Hemant Soren Comments On BJP: భూకుంభకోణం కేసులో బెయిల్పై విడుదలైన ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీహార్ నుంచి బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. తనపై కాషాయ పార్టీ కుట్రపన్నుతోందని ఆరోపించారు. మాజీ సీఎం తన నివాసంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జైలులో తనని నిర్భందించడానికి బీజేపీ కుట్రపన్నిందని ఆరోపించారు.
తనపై కుట్ర పన్నినవారిపై తిరుగుబాటు ఉంటుందని హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. బీహార్లో బీజేపీని సమాధి చేసే సమయం ఆసన్నమైందని సోరన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
భూకుంభకోణం అంశానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ శుక్రవారం రాంచీలోని బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యారు.
8.36 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేయడంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి హేమంత్ సోరెన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్టు చేసింది.
Also Read: భూ కుంభకోణం కేసు.. ఝార్ఖండ్ మాజీ సీఎంకు బెయిల్.. 5 నెలల తర్వాత బయటకు..
రాజ్యాంగ బద్ధమైన అన్ని వ్వవస్థలను బీజేపీ నియంత్రించిందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాషాయ దళానికి బుద్ధి చెప్పారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముందుస్తుగా పెట్టడానికి బీజేపీ కుట్రపన్నుతోందని తెలిపారు. అందుకు ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోందన్నారు. బీజేపీ కోరుకున్న రోజున ఎన్నికలు నిర్వహించండి అంటూ హేమంత్ సోరెన్ కమలనాథులకు సవాల్ విసిరారు. బీజేపీ కలలు కంటోందన్నారు. వివిధ రాష్ట్రాల్లో గిరిజన నేతలను ముఖ్యమంత్రులను నియమిస్తోందని వారు కేవలం రబ్బరు స్టాంప్ మాత్రమే అని ఆరోపించారు.