Suresh Gopi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఆఫ్ ఇండియా అని సంబోధించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి తన వ్యాఖ్యలపై ఆదివారం క్లారిటీ ఇచ్చారు. తిరువనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఇందిరా గాంధీని అమ్మగా అభివర్ణించానని తెలిపారు. కానీ తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు.
తాను మనస్పూర్తిగా మాట్లాడే వ్యక్తినన్న సురేష్ గోపి.. ఇందిరా గాంధీ గురించి తాను మట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా.. కేరళలో కాంగ్రెస్ పార్టీ పితామహుడు కరుణాకరణ్ అయితే.. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇందిరా గాంధీ తల్లి లాంటి వారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి చనిపోయే వరకు ఇందిరా గాంధీ భారత్కు ఆర్కిటెక్ట్ అని తెలిపారు.
విపక్ష పార్టీకి చెందిన నాయకురాలు అయినంత మాత్రాన దేశం కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని తాను ఎప్పటికీ మరిచిపోలేనని తెలిపారు. ఇక కరుణాకరణ్ను కేరళలో కాంగ్రెస్కు పితామహుడు అనడం, ఆ పార్టీ వ్యవస్థాపకులు.. సహ వ్యవస్థాపకులను అగౌరవ పరిచినట్లు కాదని తన వ్యాఖ్యలపై సురేష్ గోపి క్లారిటీ ఇచ్చారు.
Also Read: ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన రాహుల్ గాంధీ!
త్రిస్సూర్లోని దివంగత కాంగ్రెస్ సీఎం కరుణాకరణ్ మెమోరియల్ను శనివారం కేంద్ర మంత్రి సురేష్ గోపి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఆఫ్ ఇండియా అని అన్నారు. దీంతో సురేష్ గోపి వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారి తీసాయి. ఈ కారణంగానే సురేష్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.