Minister B Nagendra Resigned Amid Money Laundering Accusations: వందల కోట్ల నగదును అక్రమంగా బదిలీ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర పదవికి రాజీనామా చేశారు. సీఎం సిద్ధరామయ్యకు ఆయన రాజీనామా లేఖను సమర్పించగా.. దాన్ని గవర్నర్ కు పంపించారు. మనీలాండరింగ్ ఆరోపణలు నేపథ్యంలో నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం చర్చకు దారితీసింది.
ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసేందుకు సీనియర్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంటూ.. KMVSTDC బోర్డు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ సూసైడ్ నోట్ రాసి గత నెల 26న ఆత్మహత్యకు పాల్పడ్డారు. చంద్రశేఖర్ సూసైడ్ నోట్ ఆధారంగా బి. నాగేంద్రపై మనీలాండరింగ్ ఆరోపణలు గుప్పుమన్నాయి. సూసైడ్ నోట్ లో అతను తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం రూ.187 కోట్ల ఎస్టీ కార్పొరేషన్ నిధులు అనధికారిక బ్యాంక్ ఖాతాలకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఎస్టీ కార్పొరేషన్ నాగేంద్ర మంత్రి శాఖ కిందికే వస్తుంది. ఆ నిధులలో రూ.88.62 కోట్లు హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలకు చెందిన ఖాతాలకు బదిలీ అయినట్లు చంద్రశేఖర్ పేర్కొన్నాడు.
Also Read: Nitish Kumar: ప్రధాని పదవి ఇస్తామన్నా వద్దంటున్న నితీశ్.. కారణం ఇదేనా..?
దీనిపై యూనియన్ బ్యాంక్ సీబీఐకు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కర్ణాటక ప్రభుత్వం సైతం ఈ ఆరోపణలపై సిట్ విచారణ చేయిస్తోంది. ఈ క్రమంలో ఎస్టీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న బి. నాగేంద్ర రాజీనామా చేశారు. తనకు ఈ నగదు బదిలీలతో ఎలాంటి సంబంధం లేదని, అమాయకుడినని ఆయన పేర్కొనడం గమనార్హం.