Latest BJP News in Karnataka(Election news today): కర్ణాటకలో బీజేపీకి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపైనే ఆ పార్టీ ఎక్కువగా ఆధారపడింది. ఒకప్పుడు మాజీ సీఎం యడియూరప్ప ఒంటిచేత్తో పార్టీ బాధ్యతలు మోసేవారు. లింగాయత్ వర్గంలో పట్టున్న యడియూరప్పకు బీజేపీలో క్రమక్రమంగా ప్రాధాన్యం తగ్గిపోయింది. ఆయన కూడా ఇప్పుడు అంత యాక్టివ్ గా రాజకీయాలు చేయడంలేదు. ఆయన కుమారుడు చురుగ్గా తిరుగుతున్నా.. ఇంకా నాయకుడిగా పూర్తిగా ఎస్టాబ్లిస్ కాలేదు.
సీఎం బసవరాజ్ బొమ్మైపై ఒకవైపు అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. ఆయన గ్రాఫ్ ప్రజల్లో రోజురోజుకు పడిపోయింది. ఆయనకు యడ్డీ మాదిరిగా ప్రజల్లో అంత పట్టులేదు. బీజేపీ అధిష్టానం ఆశీస్సులతోనే ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. బొమ్మై ఎటుచూసినా బీజేపీకి మైనస్ గా మారారు. ఓటర్లను బీజేపీ వైపు ఆకర్షించడంలో విఫలమయ్యారు. బొమ్మై మోదీ మ్యాజిక్ నే నమ్ముకున్నారు.
బీజేపీలో కర్ణాటక మొత్తాన్ని ప్రభావితం చేసే మరో నాయకుడు కనిపించడంలేదు. నాయకత్వలోపం బీజేపీకి శాపంగా మారింది. అందుకే ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకుంది.ఈ ఓటమిని బొమ్మై ముందే ఊహించారని అర్ధమవుతోంది. ఫలితాలు పూర్తిగా వెలువడక ముందే ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని బొమ్మై అన్నారు. తిరిగి లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.
మరోవైపు వివాదాలు బీజేపీపై నెగిటివిటీని పెంచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం లకు ఇచ్చిన 4శాతం రిజర్వేషన్ రద్దు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఆ 4 శాతం రిజర్వేషన్ లింగాయత్ , వక్కలిగలకు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. లింగాయత్ లలోని పంచాశాలి లింగాయత్ లు రిజర్వేషన్ కోసం పోరాటం చేశారు. ఈ అంశం బీజేపీకి కొంత నష్టం కలిగించింది.
మరోవైపు మహారాష్ట్రతో బెళగావి సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఆ రాష్ట్రంలో బీజేపీ మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వమే ఉంది. కానీ ఆ సమస్యను పరిష్కరించపోవడంపై కన్నడ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. గోవాలో కలాస -బందూరి నీటి ప్రాజెక్ట్ వివాదం ఉంది. ఇలాంటి వివాదాలన్నీ బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి.