Sapta sagara yatra :- గోదావరి ఏడు పాయలలో ఒకటైన తుల్యభాగ చొల్లంగిలోని సముద్రంలో కలుస్తుంది. జీవనదియైన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావడం వల్ల ఇక్కడ స్నానం చేస్తే, నదిలో, సముద్రం లోనూ ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలం పొందుతారు. గౌతముడు కొనితెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడు పాయలుగా తీసుకొని పోయి ఏడు స్థలాలలో సంగిమించే విధంగా చేశారు. గౌతముడు స్వయంగా తీసుకెళ్లిన శాఖ గౌతమి పేరుతో మాసాని తిప్ప చోట సముద్రంలో కలుస్తుంది.
కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, ఆరుగురు ఋషులు తీసుకెళ్లిన వారివారి పేర్లతో ప్రాముఖ్యం చెందాయి. తుల్యుడు తీసుకెళ్లిన శాఖ చొల్లంగిలోను, ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన, భరద్వాజ తీర్థాల మొండి వద్ద, కౌశిక నత్తల నడక సమీపాన, జమదగ్ని కుండలేశ్వరం వద్ద, వశిష్ఠ అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి.
నర్మదానదీ తీరంలో తపస్సు, గంగానదీ తీరంలో మరణం, కురుక్షేత్రంలో దానం పుణ్యప్రదాలుగా భావిస్తుంటారు. గోదావరి నదీమ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి. కనుక ఏడు స్థలాలకు వెళ్ళి స్నానాలు ఆచరించడాన్ని ‘సప్త గోదావరుల సాగర సంగమ యాత్ర అంటారు. సంతానం, తదితర కోరికలు ఈడేరడానికి సప్తసాగర యాత్ర చేయడం సంప్రదాయ సిద్దంగా వస్తోంది.
సాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు చొల్లంగి స్నానంతో ప్రారంభం అవుతుంది. ఏడు తావులు చూసుకుని, ప్రాయకంగా మాఘ శుక్ల ఏకాదశి నాటికి వశిష్టా సాగర సంగమ స్థానమైన అంతర్వేది చేరతారు. ఆ రోజు అక్కడ గొప్ప తీర్థం జరుగుతుంది. ఏకాదశిని అంతర్వేది ఏకాదశి అని పిలవడం పరిపాటిగా మారింది. ఇలా సప్త సాగర యాత్రకు ఆది, తుది దినాలు పర్వదినాలుగా భావిస్తుంటారు.
Follow this link for more updates:- Bigtv