Big blows to Adani Group :- హిండెన్బర్గ్ ఎఫెక్ట్… అదానీ గ్రూపు కంపెనీలను ఇంకా షేక్ చేస్తూనే ఉంది. తాజాగా జరిగిన మరో మూడు పరిణామాలు, ఆ కంపెనీని కలవరపెడుతున్నాయి. అదానీ గ్రూపులోని కొన్ని కంపెనీల షేర్ల వెయిటేజీని తగ్గించింది… అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ట్రాకింగ్ సంస్థ అయిన మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్-ఎంఎస్సీఐ. మరోవైపు మూడీస్ కూడా అదానీకి చెందిన నాలుగు కంపెనీల భవిష్యత్ రేటింగ్ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి తగ్గించింది. అంతేకాదు, నార్వేకు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటిదాకా… మూడు అదానీ గ్రూప్ కంపెనీల్లో 200 మిలియన్ డాలర్ల విలువైన తన వాటా షేర్లను విక్రయించడం… అదానీ గ్రూపు కంపెనీలపై ఇన్వెస్టర్లలో అపనమ్మకాన్ని పెంచుతోంది. ఈ పరిణామాలతో… రికవరీ అవుతున్న అదానీ గ్రూపు కంపెనీల షేర్లు మళ్లీ నేలచూపులు చూస్తున్నాయి.
షేర్ల పతనంతో ఇప్పటికే 110 బిలియన్ డాలర్ల మేర విలువను కోల్పోయాయి… అదానీ గ్రూపు కంపెనీలు. అంటే భారత కరెన్సీలో 90 వేల కోట్ల రూపాయలకు పైమాటే.
ఇంత భారీ పతనం కారణంగా… అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి కంపెనీల భవిష్యత్ రేటింగ్ను స్టేబుల్ నుంచి నెగటివ్ కు తగ్గించింది… మూడీస్. అదానీ గ్రూప్కు చెందిన 8 కంపెనీల రేటింగ్లను మాత్రం యథాతథంగానే ఉంచింది.
ఇక ఎంఎస్సీఐ… నాలుగు అదానీ గ్రూపు షేర్ల ఫ్రీ-ఫ్లోట్లను తగ్గించింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, ఏసీసీ కంపెనీల ఫ్రీ ఫ్లోట్లను తగ్గించింది. ఈ నాలుగు కంపెనీల నుంచి 428 మిలియన్ డాలర్ల మేర ఔట్ ఫ్లో ఉంటుందని ఎంఎస్సీఐ అంచనా వేసింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన నార్వే సావరిన్ వెల్త్ ఫండ్… మూడు అదానీ గ్రూపు కంపెనీల్లో తనకున్న వాటాల నుంచి 200 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మేసింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.1650 కోట్లు. 24 గంటల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ మూడు పరిణామాలతో… రికవరీ దిశగా సాగుతున్నాయనుకున్న అదానీ షేర్లు.. మళ్లీ నష్టాల బాటపట్టాయి.
Follow this link for more updates:- Bigtv