Adani:హిండెన్బర్గ్ దెబ్బకు గ్రూపు కంపెనీల షేర్లు కుదేలవడం, మార్కెట్లో ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవనే కారణాలతో అదానీ ఎంటర్ప్రైజెస్ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్-ఎఫ్పీవోను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు… గౌతమ్ అదానీ. అయితే, రూ. 20,000 కోట్ల ఎఫ్పీవోపై రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు అదానీ గ్రూపు కంపెనీల ఉద్యోగులు కూడా పెద్దగా ఆసక్తి కనబరచకపోయినా… ఇష్యూ పూర్తిగా ఎలా సబ్స్క్రైబ్ అయ్యిందా? అని చాలా మందిలో అనుమానాలున్నాయి. ఎఫ్పీవో విజయవంతం అయిందని అనిపించుకోవడానికి… అదానీ తన సొంత డబ్బునే కుమ్మరించాడని… ఇప్పుడు కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎఫ్పీవో పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యేలా చేసి… ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకే ఉపసంహరించుకుంటున్నట్లు అదానీ డ్రామా ఆడారనే విమర్శలు వస్తున్నాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.20,000 కోట్ల ఎఫ్పీవో కోసం దాఖలు చేసినప్పుడు… 10 మంది అండర్ రైటర్ల పేర్లు వెల్లడించింది. వీటిలో రెండు కంపెనీలు అకౌంటింగ్ మోసం, స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ కుట్రలో అదానీ గ్రూపుకు సాయం చేశాయని హిండెన్బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. ఎక్స్ఛేంజీలకు అదానీ ఎంటర్ప్రైజెస్ దాఖలు చేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం… లండన్ కేంద్రంగా పనిచేస్తున్న పెట్టుబడి సంస్థ ఎలారా క్యాపిటల్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, భారత బ్రోకరేజీ సంస్థ మోనార్క్ నెట్ వర్త్ క్యాపిటల్… ఈ రెండు కంపెనీలను బుక్ రన్నర్స్ లేదా అండర్ రైటర్లుగా పేర్కొన్నారు. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఎలారా క్యాపిటల్ వివిధ మారిషస్ ఆధారిత ఫండ్లను నిర్వహిస్తుంది. వాటిల్లో ఒక ఫండ్ అదానీలో పెట్టుబడి పెట్టింది. అలాగే దాని హోల్డింగ్స్ లో 99 శాతానికి సమానమైన దాదాపు 3 బిలియన్ అమెరికన్ డాలర్ల షేర్లను కలిగి ఉందని హిండెన్బర్గ్ నివేదిక తెలిపింది. ఈ ఫండ్లలో అదానీ సహా ప్రమోటర్ల డబ్బు కచ్చితంగా ఉందని ఎలారా మాజీ ఉద్యోగులు చెప్పినట్లు హిండెన్బర్గ్ పేర్కొంది.
ఇక మోనార్క్ నెట్ వర్త్ కేపిటల్ అనేది చిన్న భారతీయ బ్రోకరేజీ సంస్థ. ఇది అదానీ గ్రీన్ ఎనర్జీ ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియను రెండు విడతల్లోనూ నిర్వహించింది. ఇప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీవోలోనూ… సంస్థాగతేతర పెట్టుబడిదారులకు సంబంధించిన మార్కెటింగ్ బాధ్యతలను మెనార్క్ నెట్ వర్త్ కేపిటల్ కే అప్పగించారు. ఇలా వేల కోట్ల రూపాయల విలువైన భారీ ఆఫర్ల బాధ్యతను, అదానీ గ్రూప్ తక్కువ అనుభవం ఉన్న మోనార్క్ బ్రోకరేజీ సంస్థకు ఇవ్వడంపైనా హిండెన్బర్గ్ ఆందోళన వ్యక్తం చేసింది. మోనార్క్ నెట్వర్త్ క్యాపిటల్లో అదానీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ 2016 నుంచి వాటాదారుగా ఉంది. దాంతో… వివిధ కంపెనీల ద్వారా సొంత డబ్బునే ఎఫ్పీవోలో అదానీ గుమ్మరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.