Bandi Sanjay Tweet(Telangana BJP latest news): తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న బండి సంజయ్ పార్టీ నేతలు, కార్యకర్తలకు భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ఎవరి మనసుకైనా ఇబ్బంది కలిగించి ఉంటే తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. అధ్యక్షుడిగా తన ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిందన్నారు. అంత సాడ్ స్టోరీ ఏం కాదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమయంలో తనను అరెస్ట్లు చేస్తుండగా అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తన బాధలతో పాటు సంతోషకరమైన సమయాల్లోనూ తనతో ఉన్నవారికి కృతజ్ఞతలు చెప్పారు. తనపై దాడులు జరగకుండా అడ్డుగోడలా నిలిచారని కొనియాడారు. కేసీఆర్పై పోరాటంలో అండగా నిలిచిన కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అంటూ ట్వీట్లో ప్రస్తావించారు.
ఎండనకా.. వాననకా ఈ పోరాటంలో తనకు సపోర్ట్గా ఉన్న పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. మోర్చా, సంగ్రామ సేన, సోషల్ మీడియా వారియర్స్ సేవలను కొనియాడారు. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన పార్టీ కేంద్ర నాయకత్వానికి కార్యకర్తలకు సంజయ్ ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసేందుకు సహకారించిన తెలంగాణ బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తనను ఇంతవాడిని చేసిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ప్రజాసంగ్రామ యాత్రకు సహకరించిన వారి సేవలను కూడా సంజయ్ గుర్తుచేసుకున్నారు. తాను ఏ పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ తనతో ఉండాలని కోరారు. కిషన్రెడ్డి ఆధ్వర్యంలో సరికొత్త ఉత్సాహంతో అందరం పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ట్వీట్ను ముగించారు బండి సంజయ్.