Basketball:అమెరికా స్టార్ బాస్కెట్బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును… జేమ్స్ బద్దలు కొట్టాడు. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్-ఎన్బీఏలో… ఆల్ టైమ్ స్కోరు అయిన 38,387 పాయింట్లను అందుకున్నాడు… జేమ్స్. ఇప్పటిదాకా ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట ఉంది. ప్రస్తుతం జేమ్స్ ఖాతాలో 38,388 పాయింట్లు ఉన్నాయి.
ఓక్లహమా సిటీ థండర్తో జరిగిన మ్యాచ్లో 36వ పాయింట్ వద్ద లెబ్రాన్ జేమ్స్ ఆల్ టైమ్ గ్రేట్ ఫీట్ను అందుకున్నాడు. అతని ఆటను కరీమ్ అబ్దుల్ జబ్బార్, స్టేడియంలో కూర్చుని మరీ చూడటం విశేషం. వేల మంది అభిమానుల సమక్షంలో కరీం అబ్దుల్ జబ్బార్.. లెబ్రాన్ జేమ్స్ను అభినందించడం హైలైట్గా నిలిచింది. ఈ అపురూప క్షణాల్ని ప్రత్యక్షంగా చూసేందుకు… అభిమానులు భారీగా డబ్బు ఖర్చు చేయడం విశేషం. ఈ మ్యాచ్ ఒక్కో టికెట్ ధర రూ.75 లక్షలు పలికిందంటే… జేమ్స్ అంటే అభిమానులకు ఎంత పిచ్చి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒకప్పటి ఎన్బీఏ స్టార్ అయిన కరీమ్ అబ్దుల్ జబ్బార్… 1984 ఆగస్ట్ 5న… 31,419 పాయింట్ల దగ్గర విల్ట్ చాంబర్లెయిన్ను అధిగమించి… అత్యధిక పాయింట్లు సాధించిన బాస్కెట్బాల్ ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. 1989లో కరీం రిటైర్ అయ్యే నాటికి ఆయన పాయింట్లు 38,387. 40 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఆయన రికార్డును… తాజాగా జేమ్స్ చెరిపేశాడు. 2003-04 సీజన్లో అరంగేట్రం చేసిన జేమ్స్.. తొలి సీజన్ మినహా ఆ తర్వాత ప్రతి సీజన్లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేస్తూ వస్తున్నాడు. ఒలింపిక్స్ లో 2 స్వర్ణాలు, ఒక కాంస్యం నెగ్గిన జేమ్స్… 2012, 2013, 2016, 2020లో ఎన్బీఏ ఛాంపియన్ గా నిలిచాడు. 2009, 2010, 2012, 2013లో మోస్ట్ వాల్యువబుల్ ప్లేయర్ అయ్యాడు.