Mysterious Deaths in Pakistan: పాకిస్థాన్లోని కరాచీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కరాచీలో ఎండ వేడిమి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక నాలుగు రోజుల్లోనే 450 మంది మరణించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే అందులో వీధుల్లో నివసించే వారు, నిరాశ్రయులే ఎక్కువగా ఉన్నారు. వీరి మృతదేహాలను స్థానికంగా ఉన్న మార్చురీలకు తరలిస్తున్నారు.
పాకిస్థాన్లోని అతిపెద్ద నగరం అయిన కరాచీలో ఎండ వేడిమి కొనసాగుతోంది. దీంతో వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎండల కారణంగా మరణించిన వారి కోసం కరాచీలో ఉన్న నాలుగు మార్చరీలు కూడా సరిపోవడం లేదని అధికారులు చెబుతున్నారు. మృతుల్లో వీధుల్లో నివసించేవారు, నిరాశ్రయులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారే ఎక్కువగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. అలాంటి వారిలో 128 మందిని సోమవారం మార్చురీకి తీసుకువచ్చామని అన్నారు. మంగళవారం 135 మృతదేహాలు తెచ్చినట్లు వెల్లడించారు.
కరాచీ మహానగరంలో బుధవారం ఒకే రోజు 22 గుర్తు తెలియని మృతదేహాలు కనుగొన్నారు. ఈ అనూహ్య మరణాల గురించి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంవి డ్రగ్స్ బానిసలు, 12 మందికి పైగా గుర్తుతెలియని వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో మరణించారని గుర్తించిన తర్వాత వారు డ్రగ్స్ మత్తులో తీవ్రమైన ఎండ కారణంగా చనిపోయారని తెలిపారు.
Also Read: చిచ్చురేపిన కొత్త ఆర్థిక బిల్లు.. కెన్యా పార్లమెంటు భవనానికి నిప్పు
పాకిస్తాన్ లో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇటీవల క్రిస్టల్ మెథాం ఫేటమిన్ గా పిలవబడే ఐక్ వాడకం కూడా భాగా పెరిగింది. ఇది మనుషులపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ డ్రగ్ కు అలవాటు పడినవారిలో యువతే ఎక్కువగా ఉన్నారు. ఇదిలా ఉంటే కరాచీలో 77 హీట్ వేవ్ రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. కరాచీలోని ఆసుపత్రులకు పెద్ద ఎత్తున రోగులు వస్తున్నారు. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక ఇబ్బంది పడుతున్నారు.