Big Stories

Hajj Pilgrimage 2024: హజ్ యాత్రలో 1,300 మంది మృతి.. ఆ దేశస్థులే అత్యధికం

Hajj Pilgrimage 2024: ఈ ఏడాది హజ్ యాత్రలో 1300 మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అరేబియా అధికారిక వర్గాలు వెల్లడించాయి. తీవ్రమైన ఎండలు, వడగాలులు, ఉక్కపోత ఇందుకు కారణమని పేర్కొన్నాయి. అయితే చనిపోయిన వారిలో 83 శాతం మంది చట్టవిరుద్ధగా మక్కాకు వచ్చిన వారని వెల్లడించింది. వారిలో చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి భగ భగ మండే ఎండల్లో నడుచుకుంటూ హజ్ యాత్రకు వచ్చారని సౌదీ ఆరోగ్య మంత్రి ఫహద్ బిన్ అబ్దుర్రహ్మాన్ అల్- జలజెల్ తెలిపారు. 95 మంది యాత్రికులు ఇంకా చికిత్స పొందుతున్నారని అన్నారు.

- Advertisement -

బాధితుల తరలింపు:
బాధితుల్లో కొంతమందిని మెరుగైన చికిత్స కోసం విమానాల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు తరలించినట్లు మంత్రి ఫహద్ బిన్ తెలిపారు. వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడం వల్ల మృతులను గుర్తించడం కష్టంగా మారినట్లు తెలిపారు. అంతే కాకుండా కొంతమందికి ఇప్పటికే మక్కాలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపినట్లు చెప్పారు. ఈ ఏడాది హజ్ సమయంలో సౌదీలో ఉష్ణోగ్రతలు 46 – 49 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. దీంతో మక్కాకు వెళ్లిన కొంత మంది ఎండ వేడిమికి ప్రాణాలు విడిచారు.
మృతుల్లో ఈజిప్టు వారే ఎక్కువ:
ఈజిప్టుకు చెందిన వారు హజ్ యాత్రలో 660 మందికి పైగా మరణించారు. అందులో 31 మంది మినహా మిగతా వారంతా అక్రమంగా హజ్ యాత్రకు వచ్చినవారే అని ఈజిప్టు దేశ అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే వీరిని హజ్ యాత్రకు తీసుకెళ్లిన 16 ట్రావెల్ ఏజెన్సీల లైసెన్సులను రద్దు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ ఏడాది మొత్తం ఈజిప్టు నుంచి 50 వేల మంది యాత్రికులు చట్టబద్ధ అనుమతిలో హజ్ యాత్రకు వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు.
వెనక్కి పంపిన అధికారులు:
హజ్ యాత్రకు చట్టవిరుద్ధంగా వచ్చిన అనేక మందిని సౌదీ అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. కొంత మంది భక్తులు మక్కా సహా సమీపంలోని ప్రాంతాలకు తరలివచ్చారు. చట్టవిరుద్ధంగా వచ్చిన యాత్రికులకు హోటళ్లు, గుడారాలు వంటి వసతులు కూడా దొరకకపోవడంతో మరణాలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. మృతుల్లో 165 మంది ఇండోనేషియా, 98 మంది భారతీయులు, పదుల సంఖ్యలో మలేషియా, మొరాకో మరికొన్ని దేశాల వారు ఉన్నారు. మృతుల్లో అమెరికా పౌరులు ఇద్దరు ఉన్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా పత్రిక తెలిపింది.

- Advertisement -

Also Read: పాకిస్తాన్‌లో కాంగో వైరస్ కలకలం.. వణుకుతున్న దక్షిణాసియా దేశాలు

హజ్ యాత్రలో భక్తులు మరణించడం కొత్తేమీ కాదు. ఐదు రోజుల హజ్ యాత్ర కోసం ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది సౌదీ అరేబియాకు వెళ్తారు. 2015లో మైనాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మంది మరణించారు. అంతే కాకుండా మక్కాలో క్రేన్ కూలిన ఘటనలో 111 మంది చనిపోయారు. 1990 లో జరిగిన తొక్కిసలాటలో 1,426 మంది ప్రాణాలు విడిచారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News