Prime Minister of Bangladesh to India: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూఢిల్లీకి వచ్చిన మొదటి విదేశీ అతిథి ప్రధానిగా షేక్ హసీనా కావడం విశేషం. అంతకుముందు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఆమె కూడా హాజరైన సంగతి తెలిసిందే.
ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత్లో పర్యటించాలని బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మోదీ ఆహ్వానించారు. అయితే బంగ్లా ప్రధాని వచ్చే నెలలో చైనాకు అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ తరుణంలో ఆమె న్యూఢిల్లీ పర్యటనపై పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.
ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని షేక్ హసీనా కీలక సమావేశంలో పాల్గొననున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్ ఖర్లను సైతం బంగ్లా ప్రధాని షేక్ హసీనా కలవనున్నట్లు తెలుస్తోంది.
Also Read: వియత్నాంతో పుతిన్ భేటీ..విక్టరీ డే సంబరాలకు ఆహ్వానం
బంగ్లాదేశ ప్రధాని చైనా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో చైనా పర్యటనుకు సంబంధించిన అంశాలను కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ద్వైపాక్షిక సమస్యలపై వాణిజ్యంతోపాటు కనెక్టివిటీ సమస్యలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భూటాన్, నేపాల్తో వ్యాపారం చేసేందుకు బంగ్లాదేశ్కు మార్గం కల్పించే అంశంపై చర్చలు కొనసాగున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్, బంగ్లా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.