Waltair Veerayya Veera Simha Reddy:అదిగో ఇదిగో సంక్రాంతి అని అనుకుంటుండగానే పండగ దగ్గర పడింది. సినిమాల జోరు మొదలైంది. ఈసారి సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. అందులో రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలు.. రెండు తమిళ అనువాద సినిమాలు. ఈ రెండు అనువాద సినిమాల్లో హీరోలు మాత్రం కోలీవుడ్ టాప్ స్టార్సే. ఈ నాలుగు చిత్రాల్లో అందరి కన్ను రెండు తెలుగు చిత్రాల మీదనే ఉంది. ఒకటేమో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’… రెండో సినిమా బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’. ఒకవైపు మెగాస్టార్.. మరో వైపు నందమూరి నటసింహం. ఈ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు.. ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టే జరిగాయి. వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ను రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రలో రూ.40 కోట్లు.. సీడెడ్లో రూ.14.5 కోట్లు.. నైజాంలో 18 కోట్లు (ఎన్.ఆర్.ఎ) లెక్కలో పూర్తయ్యిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక వీర సింహా రెడ్డి సినిమా విషయానికి వస్తే ఆంధ్రలో రూ.35 కోట్లు.. సీడెడ్ రూ.12.5 కోట్లు.. నైజాం రూ.15 కోట్లు (ఎన్.ఆర్.ఎ)కు అమ్ముడైందని సమాచారం. అంటే వాల్తేరు వీరయ్య సినిమాకు రూ.రూ.72.5 కోట్లు ప్రీ రిలీజ్ అయితే వీరసింహా రెడ్డి సినిమాకు రూ.62.5 కోట్లు అయ్యింది. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే నిర్మించింది. వారే సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్టార్ట్ చేసి ఈ రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.