Tollywood: టాలీవుడ్ మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని, దానికి ఇండస్ట్రీ సైతం తమవంతు కృషి చేయాలనీ తెలిపారు. నేడు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటి నార్కోటిక్స్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టాలీవుడ్ గురించి మాట్లాడారు.
” వందల కోట్లు సంపాదిస్తున్నారు. సమాజానికి కూడా సినిమా ఇండస్ట్రీ మేలు చేయాల్సిందే. ఒక సినిమాకు కోట్ల రూపాయలు తీసుకుంటున్నప్పుడు ప్రజల బాగు కోసం ఆ సినిమా తారలు కొన్ని అవగాహన వీడియోలు తీయాల్సిందే. సైబర్ క్రైమ్ , డ్రగ్స్పై సినిమాల్లో అవగాహన కల్పించేలా హీరోలతో వీడియోలు తీయించి.. సినిమా ముందు ప్రదర్శించాలి. థియేటర్లలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఉచితంగా వీడియో ప్రదర్శించాలి.
వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సరే.. చిత్ర ప్రారంభానికి ముందు ఆ వీడియోని ప్రదర్శించాలి. సినిమా కు ముందు కానీ సినిమా తరువాత అయిన కానీ రెండు లేదా మూడు నిమిషాల నిడివితో ఆ సినిమాలో ఆర్టిస్టులతో వీడియో చేసి అవగాహన కల్పించాలి.
డ్రగ్స్ నిర్మూలనను సామాజిక బాధ్యతగా తీసుకోని, డ్రగ్స్ నియంత్రణ కోసం చిరంజీవి వీడియో సందేశం పంపారు. ఆయనను నేను మనసారా అభినందిస్తున్నాను. కేవలం సినిమా టికెట్ల రేట్లు పెంచాలనో.. లేదా షూటింగులకు అనుమతులు ఇవ్వాలనో సినీ ప్రముఖులు ప్రభుత్వం దగ్గరకు రావద్దు. సమాజాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారు.. ఇలా కొంతైనా తిరిగి ఇవ్వాలి. సినీరంగంలో ఉన్నవాళ్లు డ్రగ్స్, సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించేలా వీడియోలు చేయాల్సిందే. అలా చేస్తేనే.. టికెట్ రేట్లు పెంచుతాం” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.