Samantha: సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని చాలా కాలం అయ్యింది. ఈ విషయంలో అటు చైతుగానీ, ఇటు సమంతగానీ నేరుగా మాట్లాడలేదు. ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఈ విషయంపై సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వైవాహిక బంధంలో తాను పూర్తి నిజాయతీగా ఉన్నానని తెలిపింది. కానీ ఆ బంధం కొనసాగలేదని పేర్కొంది. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్న సామ్.. తన వ్యక్తిగత జీవితంలోని కీలక విషయాలను బయటపెట్టింది.
పుష్ప మూవీలో ఐటెమ్ సాంగ్ చేయడంపైనా సమంత వివరణ ఇచ్చింది. చైతుతో డైవర్స్ అయిన కొన్నిరోజులకే ‘పుష్ప’లో ‘ఊ అంటావా’ పాట ఆఫర్ వచ్చింది. తాను తప్పు చేయనప్పుడు బాధపడుతూ ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలనిపించిందని పేర్కొంది. వెంటనే ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపింది. ఆ సాంగ్ ను అనౌన్స్ చేసినప్పుడు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఫోన్లు చేసి ఇంట్లో కూర్చో చాలు అని సూచనలు ఇచ్చారని వెల్లడించింది. విడిపోయిన వెంటనే నువ్వు ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదని సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది. తన స్నేహితులు కూడా ఆ పాటను చేయొద్దని చెప్పారని వివరించింది. కానీ పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయాలనే బలంగా నిర్ణయించుకున్నానని స్పష్టం చేసింది. వైవాహిక బంధంలో తాను 100 శాతం నిజాయతీగా ఉన్నానని అలాంటప్పుడు నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలి? అని ప్రశ్నించింది.
తనకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను సమంత వెల్లడించింది. నటిగా ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాలని, మరింత అందంగా కనిపించాలని కష్టపడుతూనే ఉన్నానని వివరించింది. మయోసైటిస్,మెడికేషన్ కారణంగా తనపై తనకే కంట్రోల్ లేకుండా పోయిందని చెప్పింది.
కళ్లద్దాలు ఎందుకంటే..?
స్టైల్ కోసం కళ్లద్దాలు పెట్టుకుంటున్నానని కొంతమంది అనుకోవచ్చని కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెలుతురును తన కళ్లు తట్టుకోలేవని వెల్లడించింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏ నటికి రాకూడదని పేర్కొంది. ఎందుకంటే కళ్లతోనే నటీమణులు హావభావాలు పలికించాలి అని చెప్పింది. ఎనిమిది నెలలుగా రోజూ పోరాటం చేస్తూనే ఉన్నానని, బాధను అనుభవిస్తూనే ఉన్నానని వివరించింది. అయితే కష్టాలను దాటుకుని ఈ స్థాయికి వచ్చానని చెప్పింది. ఇప్పుడు తన లుక్స్ పై కామెంట్స్ చేసినా పట్టించుకోనని సమంత స్పష్టంచేసింది. ఇలా సమంత ఎన్నో విషయాలను పంచుకుంది.