Big Stories

Kalki 2898 AD: 40 ఏళ్ళ క్రితమే కృష్ణం రాజు ‘కల్కి’ సినిమా మొదలు పెట్టారు.. కానీ: ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. జూన్ 27న గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ను అందుకుని కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ సినిమాలోని విజువల్స్, కంటెంట్ క్రియేటివిటీ అందరినీ ఆకట్టుకుంది. దీంతో దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా చూసిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ సహా ఇతర నటులు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని.. నాగ్ అశ్విన్ క్రియేటివిటీకి మంత్రముగ్దులయినట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీలోని చిన్న చిన్న క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తూ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. రిలీజ్ అయిన నాటి నుంచి ఈ సినిమా భారీ కలెక్షన్లను నమోదు చేసింది.

- Advertisement -

మొదటి రోజు రూ.191.5 కోట్ల వసూళ్లు రాబట్టింది. రెండు రోజుల్లో రూ.298.5 కోట్లు సాధించింది. అనంతరం మూడు రోజుల్లో రూ.415 కోట్లు కలెక్షన్ల అందుకుని అందరినీ అబ్బురపరచింది. ఇక నాలుగు రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్‌లో చేరి దుమ్ము దులిపేసింది. ఇలా రోజు రోజుకూ కలెక్షన్లలో తన హవా చూపిస్తూ అదరగొట్టేస్తుంది. ప్రభాస్ సలార్, కల్కితో వరుస హిట్లు అందుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Also Read: శరవేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి ‘కల్కి’.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్

ఇదిలా ఉంటే కల్కి మూవీ సక్సెస్‌తో ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు సతీమణి శ్యామలా దేవి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామలా దేవి ‘కల్కి’ సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేశారు. దాదాపు 40 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘కల్కి’ సినిమాను స్టార్ట్ చేశారని చెప్పుకొచ్చారు.

కృష్ణం రాజు 40 ఏళ్ల క్రితం ‘కల్కి’ పేరుతో ఓ సినిమా స్టార్ట్ చేశారని తెలిపారు. ఆ సినిమాకి సంబంధించి కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారని.. అవి ఇంట్లో ఉన్నాయని అన్నారు. అయితే ఆ చిత్రానికి ఎంఎం కీరవాణి ఓ సాంగ్ కూడా చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఆ సాంగ్ కీరవాణి ఇంట్లో దేవుడి గదిలో ఉంటుందని తెలిపారు. అయితే ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల చేత ఆగిపోయిందని.. ఇప్పుడు అనుకోకుండా ఆ పేరుతోనే ప్రభాస్ సినిమా తీసి మంచి హిట్ సాధించడం ఆనందంగా ఉందని తెలిపారు.

అలాగే కృష్ణం రాజు, ప్రభాస్ ఇద్దరూ ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించరని తెలిపారు. వీరిద్దరూ ఎదుటి వ్యక్తులకు చాలా గౌరవ మర్యాదలు ఇస్తారని.. అంతేకాకుండా అతిథులకు అన్ని రకాల వంటలను ఇంట్లోనే చేయించి.. వారిని సొంత వారిలా చూసుకుంటారని చెప్పుకొచ్చారు. సామాన్యులు, వీఐపీలు అంటూ ఎలాంటి తేడా ఉండదు అని తెలిపారు. ప్రస్తుతం శ్యామలా దేవి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News