Dwapara era:-ఈ భూమిపైన పరమశివుడు ఎన్నో క్షేత్రాలలో పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. కొండ గుహలలో .. సొరంగ మార్గాలలో .. జలపాతాలలో .. సెలయేళ్లలో ఇలా స్వామి తనకి ఇష్టమైన ప్రదేశాలలో ఆవిర్భవించడం కనిపిస్తుంది. అలా స్వామివారు కొలువైన ప్రాచీన క్షేత్రంగా గుత్తికొండ బిలం కనిపిస్తుంది. సదాశివుడు లింగరూపంలో ఆవిర్భవించి, మల్లికార్జునుడుగా పూజలు అందు కుంటున్న ఈ క్షేత్రం .. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దర్శనమిస్తుంది.
ఈ బిలం ద్వాపరయుగం నాటిది. ఈ బిలం .. లోక కల్యాణ కారకమైన ఒక సంఘటనకు నిదర్శనంగా నిలిచింది. దేవతలకు .. దానవులకు యుద్ధం సమయంలో దేవతల కోరిక మేరకు ముచికుందుడు అనే మహర్షి తన తపోబలంతో యుద్ధంలో వారి తరపున నిలుస్తాడు. యుద్ధంలో గెలిచిన దేవతలు ఏ వరం కావాలని ముచుకుందుడిని అడుగుతారు. ఏళ్లపాటు జరిగిన యుద్ధంలో తాను అలసిపోయాననీ, అందువలన తనకి దీర్ఘ నిద్రను ప్రసాదించమని కోరతాడు. తనకి నిద్రాభంగం కలిగించినవారు తన కంటి చూపుతో మసై పోవాలనే వరాన్ని పొందుతాడు.
దేవతలు ఇచ్చిన ఆ వరంతో ముచికుందుడు ఈ బిలాన్ని ఎంచుకుని నిద్రలోకి జారుకుంటాడు. అలా జరిగిన కొంతకాలానికి కృష్ణుడికి కాలయవనుడు తలనొప్పిగా తయారవుతాడు. తాను చంపకూడదు గనుక, కృష్ణుడు ఒక ఆలోచన చేసి కాలయవనుడు యుద్ధానికి రాగా భయపడుతున్నట్టుగా నటించి పరుగెత్తతాడు. కాలయవనుడు వెంటపడతాడు.. అలా కాలయవనుడ్ని తన వెనుక ఆ బిలంలోకి వచ్చేలా చేస్తాడు.
బిలం లోపలికి ప్రవేశిస్తూనే కృష్ణుడు ఓ పక్కన దాక్కుంటాడు. మరో వైపున దీర్ఘనిద్రలో ఉన్న ముచికుందుడిని కాలయవనుడు చూస్తాడు. కృష్ణుడు మాయావి కనుక … అలా నాటక మాడుతున్నాడని భావించి, ఆవేశంతో వెళ్లి ఒక్క తోపు తంతాడు. దాంతో ఒక్కసారిగా ముచికుందుడు నిద్రలేస్తాడు. ఎవడురా నాకు నిద్రాభంగాన్ని కలిగించిన మూర్ఖుడు అంటూ కళ్లు మలచుకుని ఎదురుగా ఉన్న కలయవనుడిని చూస్తాడు. అంతే .. అక్కడే అతను భస్మమైపోతాడు. అలా కాలయవనుడు కాలగర్భంలో కలిసిపోయేలా చేస్తాడు కృష్ణుడు.ఆ తరువాత ముచికుంద మహర్షికి దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడు. ఈ పురాణ సంబంధమైన సంఘటనకు సాక్ష్యంగా గుత్తికొండ బిలం కనిపిస్తుంది.
for more updates follow this link:-bigtv