సంక్రాంతి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి అలంకరించడం హిందూ సంప్రదాయం. ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారు చేసి పసుపు, కుంకుమ పెట్టి, పూలతో అలంకరించి, నవ ధాన్యాలు వాటిలో పోసి.. ముగ్గులపై అలంకరిస్తారు. అమ్మాయిలంతా గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడతారు.
ఆవును గౌరీమాతగా కొలిచే సంప్రదాయం ఉంది. అందుకే ఆవు పేడను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇందులో క్రిమీ కీటకాలను నాశనం చేసి, ప్రకృతికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అందుకే గొబ్బెమ్మలను గౌరీదేవిగా భావించి ముగ్గులపై అలంకరిస్తారు.
గొబ్బెమ్మలు గోపికలను, పూలరేకులు, పసుపు, కుంకుమలు సౌభాగ్యాన్ని సూచిస్తాయి. సంక్రాంతి ముగ్గు మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా భావిస్తారు.
ఆవుపేడతో చేసే గొబ్బెమ్మలతో సూక్ష్మజీవులు ఇంటి దరదాపుల్లోకి రావు. గోవు పేడతో గొబ్బెమ్మ వెనుక యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఉందని పెద్దలు చెప్తారు. హిమమంత రుతువు చివరిరోజులు కావడంతో ఎన్నో రకాల క్రిములు ఇంటి పరిసరాల్లోకి వచ్చే అవకాశం ఉంది వాటన్నింటి నుంచి ఆవుపేడ రక్షిస్తుందని శాస్త్రీయంగాను తేలింది.
ఆవు పేడపై వేసే నవధ్యానాలు, శనగలు పిండి కొన్ని జీవులకు ఆహారంగా ఉంటుంది. ఈ రకంగా మన పూర్వీకులు జీవకారుణ్యాన్ని పరోక్షంగా నేర్పించారు. ఆ సంప్రదాయమే తరతరాలుగా ఆచారంగా కొనసాగుతోంది. నేటి రోజుల్లో వీటి గురించి తెలిసిన వాళ్లు లేరు.
సాధారణంగా గొబ్బెమ్మలను పెళ్లికాని అమ్మాయిలే తయారు చేసి, అలంకరించాలి. అలా చేస్తే.. త్వరగా పెళ్లి అవుతుంది. అలాగే మంచి భర్త వస్తాడని నమ్మకం ఉంది. గొబ్బెమ్మలను అలంకరించడానికి ఉపయోగించే బంతి, చామంతి, డిసెంబరాలు, ముళ్ల గోరింట, గుమ్మడి పూలను స్పృశించడం కూడా ఆరోగ్యానికి మంచిది.