దక్షిణాయనంలో ధనుర్మాసం చివరిది. ఈ కాలంలో సూర్యుడి ప్రభావం భూమిపై చాలా తక్కువగా ఉంటుంది. చలి తీవ్రత అధికం అవుతుంది. ఆరోగ్యకారకమైన సూర్యరశ్మి పరిమితంగా లభించే సమయం ఇది. ఫలితంగా అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
ధనుర్మాసం నుంచి మకర సంక్రాంతి (Sankranti) వరకు చలితీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మన పెద్దలు హెచ్చరించారు. దీన్నే సంక్రాంతి నిలబెట్టడంగా పేర్కొన్నారు. అంతేకాదు ధనుర్మాసంతో చాంద్రమానం అంతర్గతంగా వచ్చే పుష్యమాసం ముడిపడి ఉంటుంది.
పుష్యమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు కావడంతో ఈ నెలను శూన్యమాసంగా పరిగణిస్తారు. ఇలా శని ప్రభావం అధికంగా ఉండటం, సంక్రాంతిని నిలబెట్టిన నెల రోజులను పీడ దినాలుగా భావించడంతో ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. ఇక శనైశ్చరుడి అనుగ్రహం కోరుతూ ఈ నెలలో నువ్వులు దానం చేయాలని సూచించారు పెద్దలు.
ఇలా దానం ఇవ్వమని చెప్పడంలోనూ గొప్ప ఆంతర్యం కనిపిస్తుంది. చలి అధికంగా ఉండే ఈ సమయంలో నువ్వులూ, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి పుట్టి, చలి నుంచి రక్షణ కలుగుతుంది. నువ్వులు కొనలేని బీదసాదలకు వాటిని దానం ఇవ్వడం అంటే.. వారికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇచ్చిన వాళ్లం అవుతామనే పెద్దలు ఇలాంటి ఆచారం పెట్టారు.