Accident on Mumbai Nagpur expressway(Telugu flash news): శుక్రవారం అర్థరాత్రి జరిగిన ఘోరప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం సమృద్ధి మహామార్గ్ గా పిలవబడే.. ముంబై – నాగపూర్ ఎక్స్ ప్రెస్ వే పై జరిగింది. జల్నా జిల్లాలోని కడ్వంచి గ్రామానికి సమీపంలోనున్న సమృద్ధి హైవేపై రెండు కార్లు ఢీ కొన్నాయి. ముంబైకి 400 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గతరాత్రి 11 గంటల సమయంలో స్విఫ్ట్ డిజైర్ కారు హైవేపైకి ఎంటర్ అవుతుండగా.. అదే సమయంలో ఎర్టిగా కారు నాగపూర్ నుంచి ముంబైకి వెళ్తుంది. స్విఫ్ట్ డిజైర్.. ఎర్టిగాను ఢీ కొట్టడంతో కారు గాల్లోకి ఎగిరి హైవే బారికేడ్ ను ఢీ కొట్టింది. కారులు ఉన్నవారంతా గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడి తీవ్రగాయాలతో మరణించారు. వారిలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై సమృద్ధి హైవే పోలీసులు, జల్నా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో ప్రమాదంలో నుజ్జైన రెండుకార్లను తొలగించారు.