RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఇండియా మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటులో ఆర్బీఐ ఎలాంటి మార్పు చేయకపోవడంతో వడ్డీరేట్లు స్థిరంగా కొనసాగనున్నాయి. దీంతో ప్రస్తుతం ఆర్బీఐ రెపోరేటును 6.50శాతం వద్ద యథాతథంగా ఉంచింది. గత కొంతకాలంగా కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆర్బీఐ రెపోరేట్లను తొలిసారిగా ప్రకటించడం విశేషం.
వరుసగా ఎనిమిదో సారి
ఆర్బీఐ రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది రెండవ ఆర్బీఐ ఎంపీసీ ప్రకటన. గతంలో ఏప్రిల్ 5న మొదటి ఆర్బీఐ ఎంపీసీ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా వడ్డీరేటు 6.5శాతం ఉండగా.. మళ్లీ దానినే కొనసాగిస్తూ.. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకోవడం గమనార్హమే. ఇలా సుమారు ఏడాది పాటు వరుసగా ఎనిమిదో సారి ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది.
వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకు ఎంపీసీ కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వివరించారు. ఆర్థిక వృద్ధి గాడిలో పడిందని, అంచనాలను దాటి వేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీంతోనే వడ్డీరేటను 6.5శాతంగా స్థిరంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కాగా, ఇటీవల ఎన్నికల ఫలితాలు రావడంతో వడ్డీరేట్లలో మార్పులు ఉంటాయని భావించనప్పటికీ ఆర్బీఐ మాత్రం వడ్డీరేట్లను స్థిరంగా ఉంచింది.
Also Read: థార్తో పోటీకి సిద్ధమైన ఫోర్స్.. కంపెనీ టార్గెట్ వారే!
ఆర్బీఐ వచ్చే నెల బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు ఈ వడ్డీ రేట్లను కోతలను సైతం నిలిపివేసే అవకాశం ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే 2025 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్బీఐ చెప్పుకొచ్చింది. అయితే గతేడాది రెపోరేటును ఆర్బీఐ పావు శాతం పెంచడంతో 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. అప్పటినుంచి ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆర్బీఐ.. ఈ రేట్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. దీంతో దాదాపు ఏడాదిపాటు రెపో రేటు స్థిరంగా కొనసాగుతోంది.