IT Employee Layoffs : ఈ గణాంకాలు చాలు… ఐటీ కంపెనీలు ఏ రేంజ్ లో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయో చెప్పడానికి. 2022లో ఏడాది మొత్తమ్మీద ప్రపంచవ్యాప్తంగా అన్ని వెయ్యి ఐటీ కంపెనీలు కలిపి లక్షా 54 వేల మందిని ఇంటికి సాగనంపాయి. అంటే రోజుకు 422 మందిని. అదే ఈ ఏడాది ఈ నెల 20 నాటికి 173 కంపెనీలు 56 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి. అంటే రోజుకు 2,800 మందికి పింక్ స్లిప్పులిచ్చాయి. ఈ లెక్కన… ఈ ఏడాది ఇంకా భారీ స్థాయిలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాజెక్టులు తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు.
కరోనా సమయంలో లాక్డౌన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డిజిటలీకరణ భారీగా పెరిగింది. దానికి తగ్గట్లే ప్రాజెక్టులు పెరిగి ఐటీ కంపెనీలకు చేతినిండా పని దొరికింది. దాంతో, వివిధ సంస్థలు ఎడాపెడా నియామకాలు చేపట్టాయి. తీరా కరోనా కష్టకాలం ముగిసి… మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొనడంతో… క్రమంగా ప్రాజెక్టులు తగ్గిపోవడం మొదలైంది. దాంతో… టెక్ కంపెనీలకు కూడా పని తగ్గిపోయింది. అదే సమయంలో ఉద్యోగుల కోసం చేస్తున్న ఖర్చు తడిసి మోపడవుతోంది. బడా ఐటీ సంస్థల్లో ఉద్యోగుల జీతభత్యాల ఖర్చే దాదాపు 65 శాతం దాకా ఉండటంతో… దాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు కంపెనీలన్నీ ఉద్యోగుల సంఖ్యలో కోత పెడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో వేల మంది భారతీయులు పని చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఎక్కువ మంది ఐటీ ప్రొఫెనల్స్ ఇండియన్సే. ఉద్యోగాలు కోల్పోతున్న వారిలోనూ మన వాళ్ల సంఖ్యే ఎక్కువ. దాంతో… కంపెనీల నిర్ణయాలు భారత కుటుంబాలను బెంబేలెత్తిస్తున్నాయి. మామూలు పరిస్థితుల్లో ఓ చోట ఉద్యోగం పోతే మరోచోట ఉద్యోగం వెతుక్కునే అవకాశం ఉంటుంది. కానీ… అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల కారణంగా కంపెనీలన్నీ మూకుమ్మడిగా సిబ్బందిని తొలగిస్తూ ఉంటే… కొత్త ఉద్యోగాలు పుట్టడం కూడా కష్టంగానే మారింది. దాంతో… చాలా మంది టెకీలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ పరిస్థితి మరికొన్నాళ్ల పాటు సాగే అవకాశం ఉందంటున్నారు… నిపుణులు.
Follow this link for more updates:- Bigtv