Hero New Bike: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటకార్ప్ తన కొత్త బైక్ విడుదల చేసింది. కంపెనీ తన ప్రీమియం సెగ్మెంట్లో కరిజ్మా స్పెషల్ ఎడిషన్ను తీసుకొచ్చింది. దీనిని సెంటినియల్ ఎడిషన్గా పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ బైక్లో చాలా పెద్ద అప్డేట్లను చూడొచ్చు. కంపెనీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ బ్రజమోహన్లాల్ గౌరవార్థం ఈ ఎడిషన్ను తీసుకొస్తున్నారు.
ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి కంపెనీ 100 యూనిట్లు మాత్రమే తయారు చేస్తోందని హీరో మోటకార్ప్ తెలిపింది. అంటే 100 మంది మాత్రమే దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కంపెనీ హీరో షోరూమ్ లేదా డీలర్షిప్ నుంచి దీన్ని విక్రయించదు. అయితే ఈ బైక్ను కేవలం వేలం ద్వారా మాత్రమే విక్రయించనున్నారు. ఈ వేలంలో కంపెనీ ఉద్యోగులు, వాటాదారులు, వ్యాపార భాగస్వాములు, సహచరులు మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. వేలం అనంతరం కంపెనీ సెప్టెంబర్ డెలివరీ చేస్తోంది.
కరిజ్మా ఈ స్పెషల్ ఎడిషన్ ఇంజన్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో కరిజ్మా XMR ఇంజన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ బైక్లో 210సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. దీని పవర్ అవుట్పుట్ 25.4 పవర్, 20.4 Nm పీక్ టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇంజన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడి ఉంటుంది. సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెండు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
Also Read: రేసింగ్ థ్రిల్లర్.. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్.. ఊపేస్తున్న లుక్!
కరిజ్మా సెంటినియల్ స్పెషల్ ఎడిషన్లో చాలా ఖరీదైన స్పేర్ పార్ట్స్ను ఉపయోగించారు. బైక్ డిజైన్ కరిజ్మా సెమీ ఫేయిరింగ్తో వస్తుంది. ఇది కార్బన్ ఫైబర్, హైడ్రో ఫార్మ్ సింగిల్ ట్యూబ్ హ్యాండిల్ బార్, మిల్లింగ్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, ఫుల్ అడ్జెస్ట్మెంట్ సస్పెన్షన్, అక్రోపోవిక్ ఎగ్జాస్ట్ను కలిగి ఉంటుంది. కార్బన్ ఫైబర్ వాడకం వల్ల బైక్ బరువు గణనీయంగా తగ్గుతుంది. దీని వల్ల దాని పనితీరు కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. ఇందులో డ్యూయల్ డిస్క్ బ్రేక్లతో గ్రే, రెడ్ కలర్స్ ఉపయోగించారు. ఇందులో ఫుల్ LED లైటింగ్, పెద్ద విండ్స్క్రీన్, వెనుక, సైడ్ ప్యానెల్లలో ఏరోడైనమిక్స్, ముందు మౌంటెడ్ మిర్రర్లు ఉంటాయి.