Financial year Budget : కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది 198 బిలియన్ డాలర్లు… అంటే రూ.16 లక్షల కోట్లకు పైగా రుణాలు సమీకరించబోతోందని… రాయిటర్స్ ఆర్థికవేత్తల సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14.2 ట్రిలియన్ రూపాయలుగా ఉన్న స్థూల రుణ పరిమితి… ఈసారి 16 ట్రిలియన్ రూపాయలకు చేరుతుందని ఆర్థికవేత్తలు లెక్కగట్టారు. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడే నాటికి దేశ స్థూల రుణ పరిమితి కేవలం 5.92 ట్రిలియన్ రూపాయలు మాత్రమే ఉంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రికార్డు స్థాయిలో 8.85 ట్రిలియన్ రూపాయలకు చేరుతుందని, ఇది జీడీపీలో 2.95 శాతమని రాయిటర్స్ పోల్ నివేదిక తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం జీడీపీలో బడ్జెట్ లోటును 6 శాతానికి తగ్గించగలరని కూడా వెల్లడించింది. ఇది 1970ల నాటి నుంచి చూసిన సగటు 4 శాతం నుంచి 5 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2025-26 నాటికి బడ్జెట్ లోటు 4.5 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.
వచ్చే ఆర్థిక సంవత్సరం ఎన్నికల ఏడాది కూడా కావడంతో… బడ్జెట్లో దేశ ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకే కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మందగించిన ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టడంతో పాటు.. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం, పేదల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుందని, దీని కోసం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా రుణాలు సమీకరించవచ్చని రాయిటర్స్ ఆర్థికవేత్తల పోల్ సర్వే అంచనా వేసింది. అదే జరిగితే… భారత దేశం మొత్తం అప్పు రూ.170 లక్షల కోట్లు దాటిపోతుందనే ప్రచారం జరుగుతోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశం అప్పులు రెండున్నర రెట్లు పెరిగాయని ఇప్పటికే గగ్గోలు పెడుతున్న విపక్షాలకు… కొత్తగా చేయబోయే అప్పులపై కేంద్రం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.
Follow this link for more updates:- Bigtv